
హైదరాబాద్: ఆరు వన్డేల సిరిస్ను మరో వన్డే మిగిలుండగానే 4-1తో సొంతం చేసుకున్న టీమిండియా ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ సిరిస్లో చివరిదైన ఆరో వన్డే శుక్రవారం (ఫిబ్రవరి 18)న సెంచూరియన్ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో చివరి వన్డేలో కోహ్లీసేన భారీ మార్పులతో బరిలోకి దిగనుంది.
చివరి వన్డే కోహ్లీసేనకు నామమాత్రమైన వన్డే కావడంతో రిజర్వ్ బెంచ్ బలం పరీక్షించాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రధాన కోచ్ రవిశాస్త్రి భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకూ ఈ సిరీస్లో జట్టులో చోటు దక్కని ఆటగాళ్లకు చివరి వన్డేలో అవకాశం కల్పించాలని జట్టు మేనేజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఐదో వన్డే విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తమ జట్టులో కొన్ని మార్పులతో ఆరో వన్డేలో బరిలోకి దిగుతామని, అయితే, తమ లక్ష్యం మాత్రం విజయం సాధించడంపైనే ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పాతికేళ్ల నిరీక్షణకు కోహ్లీసేన ఐదో వన్డేతో విజయంతో తెరదించిన సంగతి తెలిసిందే.
సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ కైవసం చేసుకుని చరిత్రను సృష్టించింది. సిరీస్ తర్వాత తామంతా కూర్చుని ఆట తీరు మరింత మెరుగుపరుచుకునేందుకు చర్చించామని కోహ్లీ అన్నాడు. ఇప్పటికే ప్రత్యర్థిపై 4-1 తేడాతో గెలుపొందిన ఉత్సాహం ఉన్నప్పటికీ, 5-1 తేడాతో సిరిస్ను సొంతం చేసుకోవడమే తమ ముందున్న లక్ష్యమని పేర్కొన్నాడు.
సుదీర్ఘమైన సఫారీ పర్యటనలో కొందరు ఆటగాళ్లు వరుస షెడ్యూళ్లతో అలసిపోయారు. ఆరు వన్డేల సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ ప్రారంభంకానుంది. టీ20 సిరీస్ను దృష్టిలో పెట్టుకున్న కోహ్లీ ప్రస్తుత జట్టులోని పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించి, ఇప్పటివరకు ఈ సిరిస్లో బెంచ్కే పరిమితమైన మిగతా ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఉన్నట్లు సమాచారం.
అయితే ఆరో వన్డేలో ఎవరెవరికి విశ్రాంతి ఇవ్వనున్నారో మాత్రం జట్టు మేనేజ్మెంట్ వెల్లడించలేదు. సెంచూరియన్ వన్డేలో ఏ ఆటగాడి స్థానంలో ఎవరు తుది జట్టులో చోటు దక్కించుకుంటారో తెలియాలంటే శుక్రవారం వరకు వేచి చూడాల్సిందే.