హైదరాబాద్: మ్యాచ్ ముగిసిన అనంతరం సౌరవ్ గంగూలీ కిట్ బ్యాగ్ తాము సర్దేవాళ్లమని టీమిండియా క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో గంగూలీ తన ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి సెహ్వాగ్, యువరాజ్ సింగ్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సెహ్వాగ్ తాను జట్టులో ఉన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నాడు. 'గంగూలీ కెప్టెన్గా ఉన్న సమయంలో అతని కిట్ బ్యాగ్ను నేను, యువీ సర్దే వాళ్లం' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పగానే వారిద్దరూ ఇలా చేయడానికి గల కారణాన్ని సౌరవ్ గంగూలీ వివరించాడు.
'ప్రేమతో కాదులే. వాళ్లిద్దరూ బయటకు వెళ్లాలని ఏదో ప్లాన్ చేసుకునేవారు. నేను మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్కు వెళ్లాల్సి ఉండేది. అక్కడి నుంచి డ్రస్సింగ్ రూమ్కి వచ్చి.. కిట్ బ్యాగ్ సర్దుకుని... స్టేడియం బయటకు వచ్చి బస్సు ఎక్కేందుకు ఆలస్యం అయ్యేదని భావించి వారే నా కిట్ బ్యాగ్ సర్దేవారు' అని గంగూలీ అన్నాడు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
అంతేకాదు భారత జట్టులో చోటు దక్కించుకున్న కొత్తలో గంగూలీ కిట్ బ్యాగ్ సర్దమని చెప్పేవాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అప్పుడు జట్టులో కొత్త వాళ్లం కదా, తప్పని సరి పరిస్థితుల్లో కిట్ బ్యాగ్ సర్దాల్సి వచ్చేదని ఒ ప్రశ్నకు సమాధానంగా సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
అయితే ఎప్పటి వరకు ఇలా సర్దారు అని అడగ్గా 'ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టే ముందు వరకు సర్దాను. ఆ సెంచరీతో బాద్షా అయ్యాను కదా. ఇక ఆ తర్వాత గంగూలీ కిట్ బ్యాగ్ సర్దలేదు' అని సెహ్వాగ్ నవ్వుతూ సమధానమిచ్చాడు. ఇదిలా ఉంటే ఇదే కార్యక్రమంలో సెహ్వాగ్ గంగూలీ ఏదో ఒక రోజు పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రి అవుతాడని జోస్యం చెప్పాడు.
'దాదా(గంగూలీ) ఏదో ఒక రోజు కచ్చితగా పశ్చిమ బెంగాల్కు ముఖ్యమంత్రి అవుతాడని వంద శాతం నమ్మకంతో చెబుతున్నా. అంతకంటే ముందు అతడు బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తాడు' అని సెహ్వాగ్ అన్న సంగతి తెలిసిందే.