వీవీఎస్ ట్వీట్
తన కెరీర్లో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సహచరులతో కలిసి ఆడానని లక్ష్మణ్ పేర్కొన్నాడు. వారిలో నచ్చిన అంశాలు, నేర్చుకున్న పాఠాలను వివరిస్తానని మే 30న వీవీఎస్ ట్వీట్ చేశాడు. అందులో భాగంగా బుధవారం ద్రవిడ్ గురించి మాట్లాడాడు. వీవీఎస్ లక్ష్మణ్ భారత్ తరఫున 134 టెస్టులు ఆడి 8,781 పరుగులు చేసారు. ఇందులో 17 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇక 86 వన్డేల్లో 2,338 పరుగులు బాదారు. వన్డేల్లో 6 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు కొట్టారు.
ద్రవిడ్ జట్టు మనిషి
'రాహుల్ ద్రవిడ్.. క్రికెట్ ఆటలో అత్యంత అంకితభావం ఉన్న విద్యార్థి. ద్రవిడ్ తిరుగులేని జట్టు మనిషి. ఎదురైన ప్రతి సవాల్ను పూర్తి బాధ్యతతో ఎదుర్కొన్నాడు. నిరాకరించేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. తెలుపు బంతి క్రికెట్లో వికెట్ కీపింగ్ చేశాడు. టెస్టుల్లో ఓపెనింగ్కు దిగాడు. అదీ అత్యంత జాగ్రత్త, చురుగ్గా' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. అంతకు ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే గురించి వివరించాడు. ద్రవిడ్ 164 టెస్టుల్లో 13,288.. 344 వన్డేల్లో 10,899.. ఒక టీ20లో 31 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించాడు.
ద్రవిడ్ క్రికెట్ కోసమే పుట్టాడు
తాజాగా రషీద్ లతీఫ్ కాట్ బిహైండ్ యూట్యూబ్ షోలో మాట్లాడుతూ... 'రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన వ్యక్తి. సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అతడి సూచనలు, మార్గదర్శకత్వం తనలోని అత్యుత్తమ ఆటతీరును ఎలా బయటపెట్టాయో యూనిస్ ఖాన్ సైతం నాతో చెప్పాడు. రాహుల్ది గొప్ప క్రికెట్ మెదడు. అతడు క్రికెట్ ఆడేందుకే పుట్టాడు. భారత్-ఏ, అండర్-19 జట్లను అభివృద్ధి చేశాడు. ఎందరో ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వచ్చారు. అందుకే అతడు క్రికెట్ కోసమే పుట్టాడని నేను అంటున్నా' అని పేర్కొన్నాడు.
ఐదో వికెట్కు 376 పరుగులు
టెస్టు క్రికెట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాను 2001లో ఈడెన్గార్డెన్స్ టెస్టులో ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ పోరాట పటిమకు హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ తోడై అసాధ్యం అనుకున్న విజయాన్ని సుసాధ్యం చేసింది. సౌరవ్ గంగూలీ సారథ్యంలో చారిత్రక విజయం సాధించిన భారత్.. అప్పట్లో సంచలనం సృష్టించింది.
తొలి ఇన్నింగ్స్లో బ్యాట్స్మెన్ తడబడటంతో 171 పరుగులకే భారత్ ఆలౌటైంది. వీవీఎస్ లక్ష్మణ్ (59) మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. ఇక భారత్ ఓటమి దాదాపు ఖాయమే అని అందరూ అనుకున్నారు. ఇక స్టీవ్ వా టీమిండియాను ఫాలోఆన్కు ఆహ్వానించాడు. శివసుందర్ దాస్ (39), శటగోపన్ రమేశ్ (30), సచిన్ టెండూల్కర్ (10) నిరాశపరచగా.. గంగూలీ (48) పర్వాలేదనిపించాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన లక్ష్మణ్ (281) టెస్టు చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 'ది వాల్' రాహుల్ ద్రవిడ్ (180)తో కలిసి లక్ష్మణ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ ఐదో వికెట్కు 376 పరుగులు జోడించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 657/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ 384 పరుగుల లక్ష్యంతో బరిలో దిగి 212కు ఆలౌటైంది. దీంతో భారత్ 171 పరుగుల తేడాతో విజయం సాధించింది.