ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న ఆరుగురు సీనియర్లు
ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న టెస్టు ఆటగాళ్లలో రహానే, మురళీ విజయ్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, పార్థివ్ పటేల్, హనుమ విహారిలు ఉన్నారు. వీరంతా కూడా నవంబర్ 16 నుంచి న్యూజిలాండ్-ఏతో మౌంట్ మాంగనీలో జరిగే నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టులో ఇండియా-ఏ తరుపున బరిలోకి దిగనున్నారు.
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో
ఈ ఆరుగురు ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం ప్రకటించిన జట్టులో ఉన్నారు. ఈ సందర్భంగా ఇండియా-ఏ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియాతో పోలిస్తే న్యూజిలాండ్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, అయితే ప్రాక్టీస్ పరంగా మాత్రం ఇది సీనియర్లకు ఉపకరిస్తుందని చెప్పాడు.
రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ
"ఇండియా-ఏ జట్టు తరఫున ఆడబోతున్న సీనియర్లకు ఇది మంచి అవకాశం. న్యూజిలాండ్తో పోలిస్తే ఆస్ట్రేలియాలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితేనేం వారందరికీ మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది. ఇటీవల బిజీ షెడ్యూల్ల కారణంగా ప్రాక్టీస్ గేమ్లకు ఎక్కువగా అవకాశం ఉండటం లేదు" అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు.
ఇండియా-ఏ మ్యాచ్లు కూడా పోటాపోటీగా
"పైగా ఇండియా-ఏ మ్యాచ్లు కూడా పోటాపోటీగా సాగుతున్నాయి. దానిని బట్టి చూస్తే ప్రధాన సిరీస్కు ముందు ఇలాంటి మ్యాచ్ మేలు చేస్తుంది" అని ద్రవిడ్ పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత అద్భుత ప్రదర్శన చేస్తోందని, దీంతో ఇండియా-ఏ పర్యటనల్లో ఎక్కువగా టెస్టు మ్యాచ్లు ఉండేలా చూసుకుంటున్నామని ద్రవిడ్ చెప్పాడు.