హైదరాబాద్: రాబోయే రోజుల్లో ఢిల్లీలో టీమిండియా మ్యాచ్లు షెడ్యూలు చేసే ముందు గాలి కాలుష్యాన్ని పరిగణనలోకి తీసుకుంటామని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగిన ప్పటికీ, మ్యాచ్లు ఎందుకు నిర్వహిస్తున్నారని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సోమవారం ఢిల్లీ ప్రభుత్వంతో పాటు బీసీసీఐని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ Vs కొలంబో: మీరే చూడండి... ఏ సిటీలో గాలి కాలుష్యం ఎక్కువో!
ఈ నేపథ్యంలో బీసీసీఐ స్పందించింది. 'ఇకపై శీతకాలంలో ఢిల్లీలో మ్యాచ్లు షెడ్యూల్ చేసేముందు గాలి కాలుష్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాం' అని బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. భారత్-శ్రీలంక జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా చివరి టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే.
మ్యాచ్ రెండో రోజు గాలిలో కాలుష్యం తీవ్రత 338గా ఉండగా, అది మూడోరోజైన సోమవారానికి 455గా నమోదైంది. నాణ్యత సూచీలో 150 మార్క్ని దాటితే డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఢిల్లీ టెస్టులో రెండోరోజైన ఆదివారం గాలి కాలుష్యం కారణంగా ఆడలేకపోతున్నామంటూ లంకకు చెందిన ఆటగాళ్లు మైదానంలో నాటకీయ పరిణామాలకు తెరలేపిన సంగతి తెలిసిందే.
ఆదివారం ఉదయం నుంచే పొగ మైదానాన్ని కమ్మేయగా.. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖాలకు మాస్కులు ధరించి ఆడారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ 240 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. లంచ్ విరామం తర్వాత మధ్యాహ్నం 12.32 ప్రాంతంలో లంక పేస్ బౌలర్ గమాగె దగ్గుతో.. బౌలింగ్ ఆపేశాడు.
ఆ సమయంలో అశ్విన్ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. మిగతా ఆటగాళ్లు కూడా అసౌకర్యంగా కనిపించడంతో ఆట నిలిచిపోయింది. గాలిలో తగినంత నాణ్యత కరవైందని శ్రీలంక ఆటగాళ్లు అంపైర్లను సంప్రదించారు. ఆటను నిలిపివేయాలని కోరారు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ఆట ఆపడం సాధ్యం కాదని లంక జట్టుకు అంపైర్లు తేల్చి చెప్పారు.
ఆదివారం ఢిల్లీ టెస్టులో ఏం జరిగింది: లంక ఆటగాళ్లు కావాలనే మాస్క్లు ధరించారా?
ఆ తర్వాత చివరికి 17 నిమిషాల తర్వాత మళ్లీ ఆట మొదలైంది. లంక జట్టు మాత్రం ఆట కొనసాగించడానికి అయిష్టంగానే కనిపించింది. ఈ క్రమంలో శ్రీలంక ఆటగాళ్లు మాస్క్లు ధరించి ఫీల్డింగ్కు దిగారు. 25 నిమిషాల తర్వాత మళ్లీ ఆ జట్టు మళ్లీ సేమ్ సీన్ రిపీట్ చేసింది. దీంతో రెండోసారి ఆట ప్రారంభమైన తర్వాత కూడా లంక ఆటగాళ్లు మళ్లీ ఆటకు అడ్డుపడ్డారు.
దీంతో ఏకాగత్ర కోల్పోయిన విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. మళ్లీ అలాగే చేస్తుండటంతో కోహ్లీ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 373 పరుగులు చేసిన ఆలౌటైంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.