సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసింది:
సమావేశం అనంతరం దాదా మీడియాతో మాట్లాడుతూ... 'ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసింది. తమ పదవీ కాలం దాటి వారు ఇక కొనసాగలేరు. ఇంతకాలం వారు విధులు చక్కగా నిర్వర్తించారు. సెలక్టర్ల విషయంలో కొత్త విధానం తీసుకువస్తాం. ప్రతి ఏడాది సెలక్టర్లను నియమించడం సరైనది కాదు' అని తెలిపాడు.
కొనసాగే అవకాశం లేదు:
బీసీసీఐ పాత రాజ్యాంగం ప్రకారం.. సెలక్షన్ కమిటీకి గరిష్టంగా నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, సభ్యుడు గగన్ ఖోడా 2015లో బాధ్యతలు స్వీకరించారు. జతిన్ పరంజ్పే, సరన్దీప్ సింగ్, దేవాంగ్ గాంధీ 2016లో కమిటీలోకి వచ్చారు. దాదా వ్యాఖ్యల బట్టి చూస్తే.. కమిటీ సభ్యులు కొనసాగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది. సవరించిన బీసీసీఐ రాజ్యాంగ ప్రకారం సెలక్షన్ కమిటీకి గరిష్టంగా ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది.
బీసీసీఐ ప్రతినిధిగా షా:
సుప్రీం కోర్టు అనుమతి లేకుండా బీసీసీఐ ఒక కీలక నిర్ణయం మాత్రం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) భవిష్యత్ సమావేశాలకు బోర్డు ప్రతినిధిగా బీసీసీఐ కార్యదర్శి జై షా హాజరవుతారని గంగూలీ వెల్లడించాడు. సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్ పరిపాలన కమిటీ (సీఓఏ) పాలన ఉన్నంత కాలం సీఈసీ సమావేశాలకు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ హాజరయ్యేవాడు. అంతకుముందు బోర్డు కార్యదర్శే వెళ్లడం సాంప్రదాయంగా ఉండేది. ఇప్పుడు మళ్లీ కార్యదర్శి వెళ్లాలనే ప్రతిపాదనకు ఏజీఎంలో అంతా అంగీకరించారు.
సచిన్, లక్ష్మణ్ మళ్లీ రారు:
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కారణంగా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)కి రాజీనామా చేసిన మాజీ దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మళ్లీ ఇందులోకి అడుగు పెట్టరని గంగూలీ స్పష్టం చేశాడు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ నిబంధన కారణంగానే తాము సీఏసీని ఏర్పాటు చేయలేకపోతున్నామని, అంబుడ్స్మన్ జస్టిస్ డీకే జైన్ను శనివారం కలిసి దీనిపై మరింత స్పష్టత కోరామని చెప్పాడు. 10 రోజుల్లో సీఏసీని ఏర్పాటు చేస్తామని దాదా తెలిపాడు.