
హైదరాబాద్: ఒకవైపు బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డారంటూ విమర్శలు సంధిస్తుంటే.. మీడియా సమావేశంలో తమ బాధను వెల్లగక్కినందుకు నెజిజన్లు జాలి ట్వీట్లు కురిపిస్తున్నారు.
గురువారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న స్మిత్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూ కంటతడి పెట్టాడు. ఈ తప్పిదానికి తానే కారణమంటూ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
కళ్లలోనుంచి ఉబికి వస్తున్న కన్నీటిని నియంత్రిస్తూ.. ఒక్కో మాటను పేర్చుకుంటూ బాధను వెల్లగక్కాడు. మీడియా సమావేశంలో ఉద్విగ్నుడై.. ప్రసంగించాడు. సిడ్నీలో స్టీవ్ స్మిత్ నిర్వహించిన మీడియా సమావేశం ఆయన అభిమానుల్నే కాదు తోటి క్రికెటర్లను దేశాలకతీతంగా కదిలించింది.
అతను వ్యక్తం చేసిన బాధను చూసి.. కేవలం నెటిజన్లే కాదు. భారత స్టార్ బ్యాట్స్ మెన్లు సైతం స్పందిస్తున్నారు. అయ్యో స్మిత్.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు వైస్ కెప్టెన్. ఓపెనర్ రోహిత్ శర్మ 'వారు చేసింది తప్పే. వాళ్లు దానిని అంగీకరించారు. కానీ, బోర్డు తీసుకున్న నిర్ణయంతో వారిని అంచనా వేయకూడదు. వారి మంచి ఆటగాళ్లు' అని పేర్కొనాడు.
'స్టీవ్ స్మిత్ బాధ నన్ను కదిలిస్తోంది. మళ్లీ క్రికెట్లోకి తిరిగొచ్చి తన సుప్రీం బ్యాటింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానల్ని అలరిస్తాడని ఎదురుచూస్తున్నా.. షేన్ వార్న్ కూడా ఇలాగే ఏడాది నిషేధం ఎదుర్కొని.. తిరిగొచ్చి శ్రీలంకపై మూడు టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు' అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో మంచి బ్యాట్స్మెన్లో స్టీవ్ స్మిత్ ఒకరని, అతను తప్పకుండా తిరిగొచ్చి.. మళ్లీ క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంటాడని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. స్టీవ్ స్మిత్ ప్రెస్మీట్ తర్వాత.. గుండె పగిలిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ట్వీట్ చేశాడు. స్టీవ్ స్మిత్, బెన్క్రాఫ్ట్ మీడియా సమావేశాలను చూడలేకపోయానని, వారు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్లో మరింత ఉత్తమంగా తిరిగొస్తారని మరో ఆటగాడు మిట్చెల్ జాన్సన్ ట్వీట్ చేశాడు.