నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు:
క్రికెట్లో టీ20లు వచ్చాక పుజారా బ్యాటింగ్ శైలి ప్రస్తుత చాలా మంది అభిమానులను ఆకట్టుకోదు. ఇటీవల బెంగాల్తో జరిగిన రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో కూడా ఇదే తరహాలో ఆడాడు. జ్వరం నుంచి కోలుకొని ఇన్నింగ్స్ కొనసాగించిన పుజారా.. 237 బంతుల్లో 66 పరుగులు చేశాడు. దీంతో సగటు క్రికెట్ అభిమానులు మళ్లీ పుజారా ఆటతీరును విమర్శించారు. దీనిపై ఇప్పుడు స్వయంగా పుజారానే స్పందించాడు. 'నా స్ట్రైక్రేట్ గురించి మీడియాలోనే అనేక రకమైన వార్తలు కనిపిస్తాయి. అయితే జట్టు అంతర్గత చర్చల్లో మాత్రం దీని గురించి అసలు ప్రస్తావనే ఉండదు. ఈ విషయంలో టీమ్ మేనేజ్మెంట్ నాకు పూర్తిగా మద్దతిస్తోంది. వేగంగా ఆడాలంటూ కెప్టెన్ నుంచి గానీ కోచ్ నుంచి గానీ నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు' అని పుజారా తెలిపాడు.
నా శైలి అందరికీ తెలుసు:
'మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా స్ట్రయిక్రేట్ గురించి చర్చ రాగానే అంతా టీమ్ మేనేజ్మెంట్ నాతో ఎలా వ్యవహరిస్తోందో అని ఆలోచిస్తారు. అయితే వారందరికీ నా శైలి బాగా తెలుసు. నా ఆట ప్రాధాన్యత కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడూ నాపై ఒత్తిడి పెంచలేదు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్ల గురించి పట్టించుకోను. అసలు అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. జట్టు మ్యాచ్లు గెలిచేలా నా వంతు పాత్ర పోషించడమే నా పని. చాలా మందికి ఒక వ్యక్తిలో తప్పును గురించి మాట్లాడే అలవాటు ఉంటుంది. ఇది నా ఒక్కడికే పరిమితం కాదు. నేను ఆడిన టెస్టులు, చేసిన పరుగులు, క్రీజ్లో గడిపిన సమయం చూస్తే ప్రత్యర్థి జట్టులో కూడా ఎక్కువ మంది ఇలానే ఆడారని అర్థమవుతుంది' అని పుజారా పేర్కొన్నాడు.
నేనేమీ సెహ్వాగ్, వార్నర్ కాదు:
నేను డేవిడ్ వార్నర్లా, వీరేంద్ర సెహ్వాగ్లా ఆడలేనని నాకు తెలుసు. కానీ.. ఒక సాధారణ బ్యాట్స్మన్ క్రీజ్లో ఎక్కువ సమయం తీసుకుంటే తప్పేమీ లేదు. అభిమానులు నేను భారీ ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటారు. నేనూ సెంచరీ చేయాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగుతాను. అయితే ఓవరాల్గా టెస్టుల్లో దాదాపు 50 సగటు ఉందంటే ప్రతీ రెండో ఇన్నింగ్స్లో నేను అర్ధ సెంచరీ చేసినట్లే. సీజన్ గొప్పగా సాగలేదనేది వాస్తవం. అయితే మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. నా ఫామ్ దిగజారిందని అంగీకరించను. ప్రతీ ఇన్నింగ్స్కు తనదైన విలువ ఉంది' అని పుజారా
టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది:
'పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎక్కువ మ్యాచ్లు ఆడే అవకాశం లభిస్తుంది. డబ్బులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి కుర్రాళ్లు టెస్టులకు దూరంగా ఉంటున్నారనేది వాస్తవం. ఇందులో తప్పేమీ లేదు. కానీ టెస్టులకు కూడా ప్రత్యేకత ఉంది. ఒక ఆటగాడి అసలు సత్తాను ఐదు రోజుల మ్యాచ్లే బయటపెడతాయి' అని పుజారా చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ తమకు అత్యంత కీలకమన్నాడు. మన పేసర్లు పూర్తి ఫిట్నెస్, తగినంత విరామంతో సిద్ధంగా ఉంటే మళ్లీ సిరీస్ గెలవవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు.