2022లో పేలవ ఫామ్..
ధవన్ ఈ ఏడాది ఇప్పటి వరకు 20 వన్డేలు ఆడాడు. వీటన్నింటిలో కలిపి కేవలం 677 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కూడా 37.61గానే ఉంది. ధవన్ కెరీర్లో 2019 తర్వాత ఇంత తక్కువ సగటు నమోదవడం ఇదే తొలిసారి. ఇక అతని స్ట్రైక్ రేట్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఈ ఏడాది ధవన్ స్ట్రైక్ రేట్ 74.48.. గత పదేళ్లలో ధవన్కు ఇదే అతి తక్కువ స్ట్రైక్ రేట్. శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి వారు రాణిస్తున్న తరుణంలో ధవన్ గాడిలో పడకుంటే జట్టులో అతని స్థానం కనుమరుగయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి.
పృథ్వీ షా..
ఈ ముంబై ప్లేయర్ లెఫ్ట్ హ్యాండర్ కాదు కానీ.. శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి వారిని కాదని పృథ్వీ షాకు వన్డే ఓపెనర్ అవకాశం లభించినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతను అలాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ఆటగాడు.
2011 వరల్డ్ కప్లో భారత్కు సెహ్వాగ్ ఇచ్చినటువంటి ఓపెనింగ్లు ఇవ్వాలంటే అది కేవలం పృథ్వీ షా మాత్రమే చేయగలిగే పని. పవర్ ప్లేలో విధ్వంసం సృష్టించడంలో పృథ్వీ షా తర్వాతనే ఎవరైనా. కొన్ని మ్యాచుల్లో అవకాశం ఇస్తే భారత జట్టుకు కూడా పృథ్వీ షా అద్భుతమైన ఆస్తిగా మారతాడనడంలో సందేహం లేదు.
రిషభ్ పంత్
పరిమిత ఓవర్ల క్రికెట్లో పేలవ ఫామ్లో ఉన్న రిషభ్ పంత్.. తన కెరీర్లో ఒకే ఒక మ్యాచ్లో ఓపెనర్గా వచ్చాడు. ఆ మ్యాచ్లో కూడా 34 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అద్భుతమైన సత్తా ఉన్న ఆటగాడిగా మన్ననలు పొందిన పంత్ను మరికొంత కాలం ఓపెనర్గా పంపితే ధవన్ లేని లోటును పూడ్చేస్తాడని నిపుణులు భావిస్తున్నారు.
మిడిలార్డర్లో పంత స్థానం డేంజర్ జోన్లో పడటం కూడా దీనికి కారణం. టీమిండియా బ్యాటింగ్ లైనప్లో శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. అతనికి అటూ ఇటూ కోహ్లీ, రాహుల్ ఉన్నారు. దీంతో టాపార్డర్లో లెఫ్ట్ హ్యాండర్ లోటు తీరాలన్నా.. పంత్కు జట్టులో చోటు దక్కాలన్నా ఓపెనింగ్కు రావడమే కరెక్ట్ అని కొందరు అంటున్నారు.
వాషింగ్టన్ సుందర్
భారత జట్టులో బౌలింగ్ చేయగలిగే బ్యాటర్ల కరువు ఎంత ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. న్యూజిల్యాండ్ పర్యటనలో ఇది మరోసారి తేటతెల్లమైంది. ఈ క్రమంలోనే వాషింగ్టన్ సుందర్ భారత జట్టులో కీలకంగా మారాడు. బౌలర్గా పది ఓవర్లు వేసి వికెట్లు తీసుకోగలిగే సత్తా అతని సొంతం. అలాగే బ్యాటింగ్లోనూ మంచి టెక్నిక్ ఉన్న ప్లేయర్.
తమిళనాడు తరఫున టాపార్డర్లో సుందర్ను మొదటి ఐదు స్థానాల్లో ఎక్కడ ఇరికించినా.. ధవన్, పంత్ ఇద్దరూ లేని లోటును పూడ్చేయొచ్చు. కాబట్టి రాహుల్ను ఓపెనింగ్ పంపించి, సుందర్ను ఐదో స్థానంలో దింపితే సరిపోతుందని కూడా కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.