కివీస్తో కీలకమైన మూడో వన్డే కోసం భారత జట్టు క్రీస్ట్ చర్చ్ చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. వీటిలో శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్ తదితరులు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నారు. అలాగే సూర్యకుమార్ యాదవ్కు జట్టు తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ సలహాలు ఇస్తున్నాడు.
కివీస్ టూర్లో భారత జట్టుకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మూడు టీ20ల సిరీస్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే పూర్తిగా జరిగింది. దాంట్లో భారత్ గెలిచింది. మరో మ్యాచ్ వర్షం వల్ల పూర్తిగా రద్దవగా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ను 1-0 తేడాతో భారత్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్గా హార్దిక్ పాండ్యకు కూడా మంచి మార్కులే పడ్డాయి.
ఇక వన్డే సిరీస్లో పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. తొలి మ్యాచ్లో శిఖర్ ధవన్, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్ అందరూ బాగానే ఆడారు. దీంతో భారీ స్కోరు చేసిన టీమిండియా.. పేలవ బౌలింగ్, ఫీల్డింగ్తో ఓటమిని మూటగట్టుకుంది. ఇక రెండో మ్యాచ్లో కేవలం 12.5 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. వర్షం మరీ ఎక్కువగా పడటంతో మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ఈ క్రమంలో మూడో వన్డే కోసం క్రీస్ట్ చర్చ్ చేరుకున్న టీమిండియా.. ఈ మ్యాచ్లో ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. ప్రస్తుతం కివీస్ 1-0తో ఈ సిరీస్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ఇక సిరీస్ గెలవడం భారత్కు అసాధ్యం. కాబట్టి చివరి మ్యాచ్లో గెలిచి కనీసం డ్రా అయినా చేసుకోవాలని భారత్ చూస్తోంది. అందుకోసం ఆటగాళ్లంతా ప్రాక్టీస్లో చెమట చిందిస్తున్నారు.