
అహ్మదాబాద్: ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య బుధవారం మధ్యాహ్నం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. డే/నైట్ టెస్ట్ కోసం టీమిండియా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఫ్లడ్లైట్ల వెలుతురులో పింక్ బాల్తో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ట్విటర్లో షేర్ చేసింది. మొతెరాలో జరగనున్న పింక్ బాల్ టెస్ట్ కోసం టీమిండియా సిద్ధమవుతోందంటూ బీసీసీఐ ఆ ఫొటోలకు కామెంట్ పెట్టింది.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. సిరాజ్ బౌలింగ్ చేస్తుండగా.. కోచ్ భరత్ అరుణ్ పక్కనే ఉండి పర్యవేక్షిస్తున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్ సుదీర్ఘంగా బౌలింగ్ సాధన చేశారు. భారత్లో జరగబోతున్న రెండో పింక్ బాల్ టెస్ట్ ఇది. ఇక టీమిండియా ఆడబోతున్న మూడో డే/నైట్ టెస్ట్.
భారత్లో తొలిసారి ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్తో టీమిండియా తొలి డే/నైట్ టెస్ట్ ఆడింది. 2019లో ఈ మ్యాచ్ జరగ్గా.. మళ్లీ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్దదైన మొతెరా మరో పింక్ బాల్ టెస్ట్కు ఆతిథ్యమిస్తోంది. పైగా మొతెరాను రెనోవేట్ చేసిన తర్వాత జరుగుతున్న తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఇదే. ఇటీవల ఆస్ట్రేలియాతో ఓ డే/నైట్ టెస్ట్ ఆడింది. భారత్ ఓ డే/నైట్ టెస్ట్ గెలిచి.. మరో దాంట్లో ఓడింది. మూడో టెస్టులో ఎలా ఆడుతుందో చూడాలి.
ఇంగ్లండ్ బ్యాటింగ్ అసిస్టెంట్ కోచ్ గ్రాహం తోర్పే మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మొతేరాలోని సీట్ల రంగు వల్ల ఫీల్డర్లకు కష్టమవుతుందన్నాడు. డే/నైట్ టెస్ట్ కావడంతో పింక్ బాల్ను గుర్తించడం ఫీల్డర్లకు కొంత కష్టమవుతుందని చెప్పాడు . 'సైట్ స్క్రీన్స్ సరిగ్గానే అమర్చి ఉన్నాయి. అయితే సీట్ల విషయంలో మాత్రం కొంత అనుమానం కలుగుతోంది. ఫీల్డర్లు బంతిని గుర్తించేందుకు కొంత ఇబ్బంది పడతారేమో అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో' అని తోర్పే చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో నిలిచాయి. దీంతో మూడో టెస్టు నిర్ణాయకంగా మారింది. అయితే ఈ సిరీస్లోని నాలుగో టెస్టు కూడా ఇదే స్టేడియంలో జరగనుంది.