
అహ్మదాబాద్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మంగళవారం ఉదయం కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇంగ్లండ్తో సిరీస్ కోసం ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్న రవిశాస్త్రి.. అక్కడి అపోలో ఆసుపత్రిలో టీకా తీసుకున్నారు. అందుకు సంబందించిన ఫొటోను ఆయన ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. తాను వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు రవిశాస్త్రి ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది, సైంటిస్టులకు టీమిండియా కోచ్ కృతజ్ఞతలు తెలిపారు.
'కొద్ది క్షణాల క్రితమే కరోనా వైరస్ వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నా. మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశాన్ని శక్తివంతం చేసినందుకు కృషి చేసిన అద్భుతమైన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు' అని కరోనా వ్యాక్సిన్ తీసుకున్న టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ట్వీట్ చేశారు. కరోనా గురించి రవిశాస్త్రి ఇదివరకు ప్రజల్లో అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.
వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 58. రవిశాస్త్రితో పాటు మరెవరైనా భారత జట్టు సభ్యులు వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.
గురువారం నుంచి ఇంగ్లండ్తో నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. సొంతగడ్డపై దుమ్మురేపుతున్న భారత్ చివరి టెస్టు కోసం సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నది. మొతెరాలో జరిగిన తొలి అంతర్జాతీయ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో.. అదనంగా మరో మూడు రోజులు కలిసిరావడంతో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేస్తున్నారు. రవిశాస్త్రి ఆధ్వర్యంలో సోమవారం కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. మరోవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా సాధన మొదలెట్టారు.