కోచ్కు అవసరం లేదు
ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓడిన టీమిండియా.. కివీస్తో టీ20, వన్డే సిరీస్ల కోసం న్యూజిల్యాండ్ వెళ్లింది. ఈ సిరీస్కు రోహిత్, కోహ్లీ తదితర వెటరన్లు దూరమయ్యారు. వీరితోపాటు కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా విశ్రాంతి తీసుకున్నాడు. ఎన్సీయే డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్కు ఈ సిరీస్లో భారత కోచ్గా బాధ్యతలు అప్పగించారు. దీన్ని తప్పుబట్టిన రవిశాస్త్రి.. కోచ్కు ప్రత్యేకంగా విశ్రాంతి అక్కర్లేదన్నాడు. జట్టును మరింత బాగా తెలుసునేందుకు కృషి చేయాలని, అలాంటి సమయంలో విశ్రాంతి ఎందుకో తనకు అర్థం కావడం లేదని చురకలేశాడు.
ఐర్లాండ్ సిరీస్కూ రాహుల్ దూరం..
గతంలో భారత జట్టు ఐర్లాండ్ పర్యటన సమయంలో కూడా రాహుల్ ద్రావిడ్ అక్కడకు వెళ్లలేదు. ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్తో కీలకమైన టెస్టు మ్యాచ్ ఉండటంతో.. ద్రావిడ్ అక్కడకు వెళ్లాడు. దీంతో ఐర్లాండ్కు కూడా లక్ష్మణే వెళ్లాడు. దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. ''నేను ఈ బ్రేక్స్ను నమ్మను. వీటి వల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని అనుకోను. ఎందుకంటే.. నేనైతే నా టీంను అర్థం చేసుకోవడానికి, ప్లేయర్లను తెలుసుకోవడాని ప్రయత్నిస్తా'' అని స్పష్టం చేశాడు.
ఐపీఎల్ టైంలో అంతా రెస్టే కదా..!
కోచ్లకు ప్రత్యేకంగా విశ్రాంతి ఎందుకు అవసరమో తనకు తెలియడం లేదన్న రవిశాస్త్రి.. ''ఐపీఎల్ సమయంలో రెండు నెలల పాటు కోచ్లకు విశ్రాంతి దొరుకుతుంది. ఆ రెస్టే ఎక్కువ అని నా ఫీలింగ్. మిగతా టైంలో కోచ్గా ఎవరున్నా సరే వాళ్లు జట్టుతోనే ఉండాలనేది నా అభిప్రాయం'' అని తేల్చిచెప్పాడు. న్యూజిల్యాండ్ సిరీస్ తర్వాత భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టుల కోసం బంగ్లాదేశ్ వెళ్తుంది. ఆ సిరీస్కు కోహ్లీ, రోహిత్ సహా ద్రావిడ్ కూడా జట్టుతో చేరతారు.