పాకిస్తాన్పై ఇంగ్లండ్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో సత్తా చాటిన ఇంగ్లండ్.. సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇంగ్లండ్ ముందంజ వేసినా.. పాకిస్తాన్కు మాత్రం చాలా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇలా పాకిస్తాన్ ఓడిపోవడంతో భారత్కు చాలా మేలు జరిగింది. ఇది తెలిసిన పాకిస్తాన్ ఫ్యాన్స్కు ఏడుపొక్కటే తక్కువగా తయారైంది పరిస్థితి.
ఇంగ్లండ్తో టెస్టు మ్యాచ్కు ముందు వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ జాబితాలో పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. అలాంటి పాకిస్తాన్.. ఇంగ్లండ్ చేతిలో ఓటమితో ఈ టోర్నీ ఫైనల్ చేరే అవకాశాలు చాలా దెబ్బతిన్నాయి. అంటే పాకిస్తాన్ ఈ రేసు నుంచి పూర్తిగా తప్పుకుందని కాదు. కానీ అవకాశాలు మాత్రం బాగా దెబ్బతిన్నాయి. అదే సమయంలో భారత్కు ఇది కలిసొచ్చింది.
ప్రస్తుతం బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమిండియా.. ఆ తర్వాత అక్కడే రెండు టెస్టు ఆడుతుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతుంది. ప్రస్తుతం వెస్టిండీస్తో టెస్టులు ఆడుతున్న ఆసీస్.. క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. తద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరే అవకాశాలు మెరుగు పరుచుకోవాలని ఆసీస్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో టీమిండియా కూడా ఆసీస్తో టెస్టు సిరీస్ గెలిచి తమ పరిస్థితి మెరుగు పరుచుకోవడానికి ట్రై చేస్తుంది.
పాకిస్తాన్ ఓటమితో భారత్ అవకాశాలు మెరుగవడం పట్ల టీమిండియా ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ మొత్తం పాకిస్తాన్ ఓడిపోతుందని కొందరు జోస్యం చెప్తుంటే.. మరి కొందరేమో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం ఇక భారత్ చేతుల్లోనే ఉంటుందని అంటున్నారు. ఇక భారత్ వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుతుందేమో చూడాలి.