హైదరాబాద్: మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సులు) చెలరేగగా, శ్రేయాస్ అయ్యర్ (88), ధావన్ (68) పరుగులు చేశారు.
ఈ మ్యాచ్తో టీమిండియా వన్డేల్లో మొత్తంగా 300పైచిలుకు స్కోరు చేయడం భారత్కు ఇది వందోసారి. 1996లో షార్జా వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలు సెంచరీలు సాధించడంతో తొలిసారి 305/5తో టీమిండియా ఈ మార్క్ని అందుకుంది.
చివరగా ఇటీవల న్యూజిలాండ్పై కాన్పూర్ వేదిక జరిగిన వన్డేలో 337 పరుగులు చేసింది. ఈ వన్డేలోనూ రోహిత్ శర్మ 147 పరుగులు చేయగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (113) సెంచరీలతో మెరిశారు. ఇప్పుడు మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా 300పైచిలుకు పరుగులు చేసింది.
ఇదిలా ఉంటే 2017లోనే భారత్ జట్టు ఏకంగా 10 సార్లు 300పై చిలుకు పరుగులు చేయడం విశేషం. ఇందులో శ్రీలంక, ఇంగ్లాండ్పై మూడేసి సార్లు, పాకిస్థాన్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్పై ఒక్కోసారి 300 పరుగుల మార్క్ని టీమిండియా అందుకుంది. ఈ జాబితాలో భారత్ తర్వాత ఆస్ట్రేలియా (96సార్లు) రెండో స్ధానంలో ఉంది.