ఓపెనర్గా రోహిత్
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. దాదాపు ఏడాది తర్వాత తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగనున్నాడు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. గత మ్యాచ్ల్లో నిరాశపరిచిన మయాంక్ అగర్వాల్ బెంచ్కు పరిమితమయ్యాడు. మయాంక్ రెండు టెస్టుల్లోనూ 31 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతని షాట్ సెలక్షన్తో పాటు ఫుట్ వర్క్ మెరుగ్గా లేదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
రాహుల్ గాయం విహారికి కలిసొచ్చింది
వన్డౌన్లో చతేశ్వర్ పుజారా, నాలుగో స్థానంలో అజింక్య రహానే ఆడతారు. తెలుగు క్రికెటర్ హనుమ విహారికి టీమిండియా మేనేజ్మెంట్ మరో అవకాశం ఇచ్చింది. సూపర్ ఫామ్లో ఉన్న స్టార్ బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా టెస్ట్ సిరీస్ నుంచి వైదొలగడం మనోడికి కలిసొచ్చింది. లేదంటే రాహుల్ ఆడేవాడు. ఇక ఆరులో వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఏడవ స్థానంలో రవీంద్ర జడేజాలు బ్యాటింగ్ చేస్తారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కింది.
|
సైనీ టెస్టుల్లో అరంగేట్రం
పేస్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీ ఆడనున్నారు. గాయంతో ఉమేశ్ యాదవ్ సిరీస్కు దూరమైన నేపథ్యంలో యువ పేసర్ నవదీప్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. దీంతో చోటు ఆశించిన శార్దూల్ ఠాకూర్, టీ నటరాజన్లకు నిరాశే మిగిలింది. ఈ మ్యాచ్తో సైనీ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. సైనీతో కలిపితే ఈ సిరీస్లో టెస్ట్ అరంగేట్రం చేసిన భారత ఆటగాళ్ల సంఖ్య మూడుకి చేరింది. ఇంతకుముందు బాక్సింగ్ డే టెస్ట్లో మహ్మద్ సిరాజ్, శుభ్మన్ గిల్ కూడా టెస్టుల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
తుది జట్టు
రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానే (కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్కు హాజరైన అభిమానికి కరోనా.. ఆందోళనలో క్రికెట్ ఆస్ట్రేలియా!!