ఐసోలేషన్లో ఉండాలి
కరోనా పాజిటివ్గా తేలిన అభిమానితో కలిసి మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకొని, ఐసోలేషన్లో ఉండాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ (డీహెచ్హెచ్ఎస్) ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 27న మెల్బోర్న్ స్టేడియంలోని ది గ్రేట్ సదర్న్ స్టాండ్లో కూర్చొని మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 3.30 గంటల వరకు మ్యాచ్ చూసిన వాళ్లు టెస్టులు చేయించుకోవాలని స్పష్టం చేసినట్లు ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో ప్రతి రోజూ స్టేడియంలో భారీ ఎత్తున క్లీనింగ్ ప్రక్రియ నిర్వహించినట్లు ఎంసీసీ చెప్పింది. ఇప్పుడా కరోనా సోకిన వ్యక్తి ఉన్న స్టాండ్స్ను మరోసారి శానిటైజ్ చేస్తున్నట్లు తెలిపింది.
అప్పుడు కరోనా సోకలేదు
'డిసెంబర్ 27న గ్రేట్ సౌథర్న్ స్టాండ్లోని జోన్-5లో మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల సమయంలో మ్యాచ్ చూసిన వాళ్లు కరోనా టెస్టు చేయించుకోవాలి. నెగెటివ్ వచ్చే వరకు ఐసోలేషన్లో ఉండాలి. బాక్సింగ్ డే టెస్టుకు హాజరైన సమయంలో సదరు అభిమానికి కరోనా సోకలేదు. ఆ తర్వాత అతడు మహమ్మరి బారినపడ్డాడు. అయినప్పటికీ వైద్యశాఖ సూచనల మేరకు కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చేవరకు ఐసోలేషన్లోనే ఉండాలి. బాక్సింగ్ డే టెస్టులో ఆట ముగిసిన తర్వాత ప్రతిసారి మైదాన సిబ్బంది స్టేడియాన్ని శానిటైజ్ చేశారు. కరోనా సోకిన వ్యక్తి ఉన్న స్టాండ్స్ను మరోసారి శానిటైజ్ చేశాం' అని మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ తెలిపింది.
తప్పనిసరిగా మాస్కు ధరించాలి
ఈ విషయం వెలుగులోకి రావడంతో సిడ్నీలో జరిగే మూడో టెస్టుపై ఆంక్షలు మరింత పెరిగాయి. సిడ్నీ టెస్టుకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం సూచించింది. నిబంధనలు అతిక్రమించిన వారు 1000 డాలర్లు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. సిడ్నీలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో మూడో టెస్టుకు 50 శాతానికి బదులుగా 25 శాతం మంది ప్రేక్షకులనే అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది.