ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో సంచలనం:
చేతిలో 5 వికెట్లు ఉన్నాయి.. విజయానికి కావాల్సింది కేవలం 5 పరుగులు మాత్రమే. ఇంకా 66 బంతులు మిగిలే ఉన్నాయి. అయినా ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ విచిత్ర ఘటన ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెర్త్ వేదికగా జరుగుతున్న దేశీయ వన్డే కప్ టోర్నీలో భాగంగా టాస్మానియా, విక్టోరియా జట్లు తలపడ్డాయి.
|
185 పరుగులకు ఆలౌట్:
మొదటగా బ్యాటింగ్ చేసిన విక్టోరియా 47.5 ఓవర్లలో 185 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆటగాళ్లు మొదటి నుంచి తడబడంతో విక్టోరియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. విల్ సదర్లాండ్ (53) అర్ధ సెంచరీ చేయగా.. ఆసీస్ స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ 34 పరుగులతో రాణించాడు. టాస్మానియా బౌలర్లు నాథన్ ఎల్లిస్ 3/35, జాక్సన్ బర్డ్ 2/27 రాణించారు.
విజయానికి 11 ఓవర్లలో 5 పరుగులు:
అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టాస్మానియా 39 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. చేతిలో 5 వికెట్లు ఉన్నాయి, ఇక విజయానికి 11 ఓవర్లలో 5 పరుగులు కావాలి. దీంతో టాస్మానియా విజయం ఖాయం అనుకున్నారంతా. కానీ పది బంతుల్లో చివరి ఐదు వికెట్లు కోల్పోయి మూడు పరుగులే చేసి అనూహ్యంగా ఓటమిపాలైంది.
40వ ఓవర్లో పతనం ఆరంభం:
విక్టోరియా పేసర్ జాక్సన్ 40వ ఓవర్లో ముగ్గురు బ్యాట్స్మెన్ను పెవిలియన్కు పంపించాడు. ఈ ముగ్గురు కూడా క్యాచ్ అవ్వడం విశేషం. ఇక తర్వాత ఓవర్ వేసిన ఫాస్ట్బౌలర్ క్రిస్ మిగిలిన రెండు వికెట్లను తీయడంతో విక్టోరియా ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. ఈ రెండు వికెట్లు ఎల్బీ ఔట్ అవ్వడం మరో విశేషం.
సోషల్ మీడియాలో వైరల్:
చివరి ఐదు వికెట్లను సంబందించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన కొద్ది వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంతేకాదు అభిమానులు తమదైన స్టయిల్లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.