గంటన్నర ముందే ఐపీఎల్ ఆరంభ వేడుకలు
ఐపీఎల్ 11వ సీజన్ తొలి మ్యాచ్కు గంటన్నర ముందే ఐపీఎల్ ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఐపీఎల్ 11వ సీజన్కు అట్టహాసంగా తెరలేవనుంది. కిక్కిరిసిన అభిమానుల మధ్య లీగ్ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ తారలు అదనపు ఆకర్షణగా నిలువనున్నారు. గంటల పాటు సాగే ఈ వేడుకలో బాలీవుడ్ తారలు తళుక్కుమనబోతున్నారు.
హృతిక్ రోషన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నృత్యాలు
హృతిక్ రోషన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు నృత్యాలతో అభిమానులను కనువిందు చేయనున్నారు. మరికొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. వేడుకలు ముగిసిన తర్వాత చెన్నై, ముంబై మ్యాచ్ మొదలవుతుంది. ఐపీఎల్ ఆరంభ వేడుకలకు సంబంధించి ముంబైలోని వాంఖడె స్టేడియంలో బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, తమన్నా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శనివారం డ్యాన్స్ రిహార్సల్స్ చేశారు.
ఐపీఎల్ అధికారిక ట్విట్టర్లో ఫోటోలు
ఈ ఫోటోలు ఐపీఎల్ నిర్వాహాకులు తమ అధికారిక ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. ఐపీఎల్లో అత్యధికంగా మూడుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలవగా, లీగ్లో ఆడిన ప్రతిసారీ కనీసం ప్లేఆఫ్ చేరడంతో పాటు రెండుసార్లు టైటిల్ సాధించి, మూడుసార్లు రన్నరప్గా చెన్నై సూపర్కింగ్స్ జట్టు నిలిచింది.
తొలి మ్యాచ్లో హాట్ ఫేవరేట్గా చెన్నై
అలాంటి రెండు జట్ల మధ్య ఐపీఎల్ 11వ సీజన్ ఆరంభం కాబోతోంది. ఈ రెండు జట్లు వేటికవే సాటి. అయితే తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ జట్టు రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి లీగ్లోకి అడుగుపెడుతోంది కాబట్టి. అంతేకాదు ఐపీఎల్లో ఎక్కువమంది అభిమానులను కలిగి ఉన్న జట్లలో చెన్నై ఒకటి.
తొలి మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అభిమానులు
పైగా రెండేళ్ల విరామం తర్వాత ఆ జట్టు మళ్లీ మైదానంలోకి వస్తుండటంతో తమిళులే కాదు.. దేశవ్యాప్తంగా ఆ జట్టు అభిమానులంతా చాలా ఉత్కంఠతో, ఉద్వేగంతో తొలి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ముంబై విషయానికి వస్తే మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో తడబడుతున్న రోహిత్.. తనకు తిరుగులేని రికార్డున్న ఐపీఎల్లో తిరిగి ఫామ్ అందుకుంటాడన్నది అభిమానులు ఆశిస్తున్నారు.