సిడ్నీ: సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ను నిలువరించాలంటే స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కోవాలన్నారు ఇంగ్లండ్ మహిళల కెప్టెన్ హీథర్ నైట్. భారత స్పిన్నర్లలో ముఖ్యంగా పూనమ్ యాదవ్ను ఎదుర్కోవడం చాలా కీలకం అని హీథర్ అభిప్రాయపడింది. లీగ్ దశలో నాలుగు వరుస విజయాలతో సత్తా చాటిన భారత మహిళలు టీ20 ప్రపంచకప్లో అసలు పోరుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన క్రికెటర్.. 9 నెలల శిక్ష ఖరారు!!
సెమీఫైనల్ మ్యాచ్ సందరంగా ఇంగ్లండ్ కెప్టెన్ హీథర్ నైట్ మాట్లాడుతూ... 'భారత్ను నిలువరించాలంటే స్పిన్నర్లను కాచుకోవాలి. ముఖ్యంగా ఫామ్లో ఉన్న పూనమ్ యాదవ్ను ఎదుర్కోవడం చాలా కీలకం. ఆమెను ఎలా ఆడాలన్న విషయమై తీవ్రంగా ప్రాక్టీస్ చేశాం. పూనమ్ బౌలింగ్ను ఆడేందుకు సిద్ధమై రావడం వల్ల గత టీ20 ప్రపంచకప్లో పూనమ్ను సమర్థంగా అడ్డుకున్నాం' అని తెలిపింది.
'మాకు ఇప్పుడు (అసిస్టెంట్ కోచ్) అలీ మైడెన్ లేరు. అద్భుతమైన లెగ్-స్పిన్ బౌలింగ్ చేసేవారు. అయినా మాకు కొత్త కోచ్లు వచ్చారు. వారు అద్భుతంగా బౌలింగ్ చేసారు. మాకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పూనమ్ యాదవ్ను మేము ఎలా ఆడబోతున్నాం అనే దానిపై స్పష్టంగా ఉన్నాం' అని హీథర్ నైట్ పేర్కొంది.
'పూనమ్ యాదవ్ నుంచి భారీ ముప్పు మాకు ఉంది. గత ప్రపంచకప్ నుండి ఆమె బాగా బౌలింగ్ చేస్తోంది. మేము విజయవంతం కావడానికి యాదవ్తో పాటు మిగతా స్పిన్నర్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఆటలో కీలకం కానుంది. సెమీఫైనల్ కాబట్టి మేము అందరం బాగా ఆడాలని నిర్ణయించుకున్నాం. మా వ్యూహలు మాకున్నాయి. వాటిని అమలు పరుస్తాం' అని ఇంగ్లండ్ కెప్టెన్ చెప్పుకొచ్చింది.
భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 19 టీ20 మ్యాచ్లు జరగ్గా.. భారత్ 4 గెలిచి, 15 ఓడింది. ఇటీవల ముక్కోణపు టోర్నీలో భాగంగా రెండు సార్లు తలపడగా.. ఇరు జట్లు చెరో మ్యాచ్ నెగ్గాయి. పిచ్ స్పిన్కు అనుకూలం. వర్షం పడితే పిచ్ స్వభావంలో మార్పు రావచ్చు. మ్యాచ్ సమయంలో వర్ష సూచన ఉంది. ఆటకు అంతరాయం కలిగించడం ఖాయం.