28న ఐసీసీ బోర్డు మీటింగ్:
టీ20 ప్రపంచకప్ కోసం 16 జట్లు ఆస్టేలియాకు రావాల్సి ఉంటుంది. ప్రయాణం, తదితర విషయాల్లో చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి మెగా టోర్నీని ఏకంగా 2022కి మార్చే ఆలోచనలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉందని సమాచారం తెలుస్తోంది. ఈనెల 28న ఐసీసీ బోర్డు మీటింగ్ జరగనుండగా.. టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నారట. ముఖ్యంగా టోర్నీ వాయిదాపైనే ప్రధాన చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.
2022కు వాయిదా?:
ఆస్ట్రేలియాలో అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు జరగాలి. క్రికెట్ కార్యకలాపాలు పుంజుకునే క్రమంలో టోర్నీ నిర్వహణపై మూడు అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే.. 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తూ ప్రేక్షకులను కూడా అనుమతించడం మొదటి అవకాశం. ఖాళీ స్టేడియాల్లో టోర్నీని జరపడం రెండోది. 2022కి టోర్నీని మార్చడం మూడోది. ఈ మూడు ప్రత్యమ్నాయాలను బోర్డు మీటింగ్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ద్వైపాక్షిక సిరీస్ వైపే సీఏ మొగ్గు:
ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతుండడంతో ప్రయాణ ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీని ఇప్పుడు జరపకపోవడం అటు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు కూడా మేలు చేస్తుందని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. ఇక టోర్నీని రెండేళ్లకు వాయిదా వేయడంపై కూడా ఆతిథ్య ఆస్ట్రేలియాకు కూడా అంతగా అభ్యంతరం లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ నిర్వహణ కన్నా ద్వైపాక్షిక సిరీస్ వైపే మొగ్గు చూపనున్నట్లు సమాచారం.
మూడు ప్రతిపాదనలు:
'ఐసీసీ ఈవెంట్స్ కమిటీ నుంచి మాకు మూడు ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే 14 రోజుల క్వారంటైన్ అమలు చేస్తూ ప్రేక్షకులను కూడా అనుమతించడం మొదటిది. ఖాళీ స్టేడియాల్లో టోర్నీని జరపడం రెండోది. 2022కి టోర్నీని మార్చడం మూడోది' అని సీఏ బోర్డు సభ్యుడు తెలిపారు. మొదటి రెండు ప్రతిపాదనలతో..16 జట్ల ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది, టీవీ సిబ్బందికి క్వారంటైన్ ఖర్చులు భారీగా ఉంటాయన్నారు.
టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే:
టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో పాటు వివిధ ద్వైపాక్షిక సిరీస్లు నిర్వహించుకునే అవకాశముంది. టీ20 ప్రపంచకప్పై సరైన నిర్ణయం తీసుకుంటే అన్ని బోర్డులు ద్వైపాక్షిక సిరీస్లకు ప్రణాళికలు రచిస్తాయి. ఇక టీ20 టోర్నీ కంటే కూడా భారత పర్యటనపైనే ఆసీస్ బోర్డు దృష్టి పెడుతున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ టూర్ జరిగితే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆసీస్ బోర్డు.. ఆర్థికంగా కుదుట పడుతామని భావిస్తోంది.