9ఓవర్లకు కుదింపు..
మధ్యాహ్నం 1.30కు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కాస్త బ్రేక్ ఇవ్వడంతో మ్యాచ్ను 9 ఓవర్లకు కుదించి ప్రారంభించారు. ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జింబాబ్వే ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 పరుగులు చేసింది. వెస్లీ మధెవెరె(18 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35 నాటౌట్) ధాటిగా ఆడగా.. మిల్టన్ షుంబా(20 బంతుల్లో 2 ఫోర్లతో 18 నాటౌట్) అండగా నిలిచాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా.. అన్రిచ్ నోర్జ్, వ్యాన్ పార్నెల్ తలో వికెట్ తీసారు.
డికాక్ బౌండరీల విధ్వంసం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా తమ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించింది. డికాక్ తొలి బంతి నుంచే హిట్టింగ్కు దిగాడు. వరుసగా ఐదు బంతులను 4, 4, 4, 6, 4 బౌండరీలకు తరలించాడు. చివరి బంతికి సింగిల్ తీసి 23 పరుగులు పిండుకున్నాడు. రెండో ఓవర్లో ఓ బంతి వేయగానే మళ్లీ వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటి తర్వా వర్షం ఆగిపోవడంతో అంపైర్లు మైదానాన్ని పరిశీలించి ఆటను తిరిగి ప్రారంభించారు. మరో రెండు ఓవర్ల ఆటను కుదించి 7 ఓవర్లలో సౌతాఫ్రికా టార్గెట్ను 64గా నిర్ణయించారు. ఆ తర్వాత కూడా డికాక్ తన జోరును కొనసాగించాడు. రెండో ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలతో మొత్తం నాలుగు ఫోర్లు కొట్టిన అతను రెండో ఓవర్లో జట్టు స్కోర్ను 40 ధాటించాడు.
13 పరుగుల దూరంలో చేజారిన విజయం..
ఇక మూడు ఓవర్లు ముగిసేసరికి వర్షం మళ్లీ రావడం.. ఎంతకీ బ్రేక్ ఇవ్వకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. మూడు ఓవర్లలోనే సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. మరో 13 పరుగులు చేసి ఉంటే ఆ జట్టు విజయం లాంఛనమయ్యేది. ఒక పాయింట్ సౌతాఫ్రికా ఖాతాలో చేరినా.. ఆ జట్టు సెమీస్ అవకాశాలను దెబ్బతీయనుంది. చిన్న దేశంపై సౌతాఫ్రికా సునాయస విజయాన్నందుకునేది. ఇప్పడు ఆ జట్టు భారత్, పాక్తో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. ఈ రెండు జట్ల చేతిలో ఒక్క మ్యాచ్ ఓడినా.. రద్దయినా సెమీస్ అవకాశాలు క్లిష్టమవుతాయి.