ఆందోళన అవసరం లేదు..
జింబాబ్వేతో ఆదివారం జరిగిన ఆఖరి పోరులో టీమిండియా సమష్టిగా రాణించి 71 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్-2 టాపర్గా భారత్ సెమీస్ బెర్త్ను ఖారారు చేసుకుంది. దాంతోనే గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో గ్రూప్-1 రన్నరప్ అయిన ఇంగ్లండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. టీ20 ప్రపంచకప్లో వరుసగా విఫలమైన దినేశ్ కార్తిక్కు బదులు.. సూపర్ -12 చివరి మ్యాచ్ అయిన జింబాబ్వేతో పోరుకు రిషభ్ పంత్ను టీమిండియా ఆడించింది. అయితే కేవలం 3 పరుగులకే పెవిలియన్కు చేరి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. రిషభ్ పంత్ వైఫల్యంపై స్పందించాడు.
సన్నాహకంగా భావించాం..
'కేవలం ఒక్క మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి అవసరం లేదు. అభిమానులు కూడా ఇలా అంచనాకు వస్తారని అనుకోవడం లేదు. ఒక్కోసారి మ్యాచ్ పరిస్థితికి అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ను సెమీ ఫైనల్కు రిహార్సల్గా మాత్రమే పరిగణించాం. టాస్ నెగ్గినప్పుడు తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం కూడా అందులో భాగమే. ప్రతి మ్యాచ్లో టాస్ గెలవడం కూడా చాలా కీలకం. పాకిస్థాన్తో తొలి మ్యాచ్లో టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోవాలని ముందు అనుకొన్నాం. ఇప్పుడు జింబాబ్వేపైనా మొదట బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందని పరిశీలించాం.
స్పిన్నర్లకు అనుకూలంగా..
ఇంగ్లండ్తో మ్యాచ్కు తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఇప్పుడే చెప్పలేను. అయితే 15 మందిలో ప్రతి ఒక్కరిపై మాకు నమ్మకం ఉంది. అత్యుత్తమ జట్టుతోనే ఇక్కడికి వచ్చాం. అడిలైడ్లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని పాకిస్థాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్తో అర్థమైంది. తాజాగా నేను కూడా పిచ్ను పరిశీలించా. నెమ్మదిగా ఉండి బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతకుముందు ఇక్కడే బంగ్లాదేశ్తో ఆడిన పిచ్ స్పిన్నర్లకు పెద్దగా సహకరించలేదు. అయితే కొత్త పిచ్ మాత్రం టర్నింగ్కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. మ్యాచ్ సమయానికి పిచ్కు తగ్గట్లుగా తుది జట్టును ఎంచుకొంటాం'అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.
యుజ్వేంద్ర చాహల్కు చాన్స్..
వికెట్ స్పిన్కు అనుకూలిస్తే యుజ్వేంద్ర చాహల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అతను జట్టులోకి వస్తే అక్షర్ పటేల్పై వేటు పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ జట్టులో లెఫ్టాండర్స్ ఉన్న నేపథ్యంలో అశ్విన్ను పక్కనపెట్టే సాహసం రోహిత్ చేయకపోవచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కావాలనుకుంటేనే చాహల్ జట్టులోకి వస్తాడు. లేదంటే ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ టీమ్నే కొనసాగించనున్నారు. రిషభ్ పంత్కు మరో అవకాశం ఇవ్వవచ్చు. విన్నింగ్ కాంబినేషన్ అనే సెంటిమెంట్ అనుకుంటే కార్తీక్ మళ్లీ జట్టులోకి రావొచ్చు.