అడిలైడ్: టీ20 ప్రపంచకప్ 2022లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయాన్నందుకుంది. అఫ్గానిస్థాన్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో 4 పరుగులతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించినా సెమీస్ చేరలేని పరిస్థితి ఆ జట్టుది. శనివారం (నవంబర్ 5న) ఇంగ్లండ్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపైనే ఆసీస్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్లో లంక గెలిచినా ఆ జట్టుకు ఉపయోగం ఉండదు. కానీ.. ఆసీస్ సెమీస్కు చేరుకొంటుంది. ఒకవేళ ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ బెర్తు ఆ జట్టుకే ఖాయమవుతుంది.
తాజాగా అఫ్గాన్పై కష్టపడి నెగ్గిన తర్వాత ఆసీస్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఇదే ఆశించాడు. తమ జట్టు కోసం తప్పకుండా ఇంగ్లండ్పై శ్రీలంక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని వ్యాఖ్యానించాడు. అర్ధశతకం చేసిన మ్యాక్స్వెల్ ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకొన్నాడు.
'అఫ్గానిస్థాన్ చాలా బాగా ఆడింది. బౌలింగ్లో అద్భుతం చేసింది. పవర్ ప్లే ఓవర్లలో చాలా ఒత్తిడి తెచ్చారు. అయితే చివరికి మేం కొన్ని మంచి షాట్లు ఆడటంతో మ్యాచ్లోకి వచ్చేశాం. చివర్లోనూ కట్టుదిట్టంగా బంతులను సంధించారు. అయితే పోరాడే స్కోరు వచ్చిందని మాత్రం మాకు తెలుసు. వారు తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విజయం సాధించాం. ఇక శ్రీలంక తప్పకుండా మా కోసం తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తుందనే నమ్మకం ఉంది'' అని మ్యాక్స్వెల్ వెల్లడించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్వెల్(32 బంతుల్లో 6 ఫోర్లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మిచెల్ మార్ష్(30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 45), డేవిడ్ వార్నర్(18 బంతుల్లో 5 ఫోర్లతో 25) విలువైన పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా.. ఫజల్లాక్ ఫరూఖీ రెండు వికెట్లు పడగొట్టాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. రషీద్ ఖాన్కు తోడుగా గుల్బాదిన్ నైబ్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39), రెహ్మానుల్లా గుర్బాజ్(17 బంతుల్లో 2ఫోర్లు, 2 సిక్స్లతో 30) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ఆడమ్ జంపా రెండేసి వికెట్లు తీయగా.. కేన్ రిచర్డ్స్ ఓ వికెట్ పడగొట్టాడు.