|
అసలేం జరిగిందంటే..?
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సందర్భంగా లాహిరు కుమారా వేసిన 12వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ మూడో బంతిని లాహిరు కుమారా షార్ట్ పిచ్ బాల్గా సంధించగా.. మ్యాక్స్వెల్ ఆఫ్ వికెట్ వైపు జరిగి బ్యాక్వర్డ్ స్క్వేర్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతిని అంచనా వేయడంలో అతను విఫలమయ్యాడు. దాంతో బ్యాట్ను మిస్సైన బంతి అతని మెడను బలంగా తాకింది. వెంటనే పక్కకు పరుగెత్తిన మ్యాక్సీ.. నొప్పితో విలవిలలాడాడు. మ్యాక్సీకి బంతిని తాకిన విధానం.. ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఘటనను గుర్తు చేసింది.
రాకాసి బౌన్సర్కు మరణం..
ఏడేళ్ల క్రితం (2014, నవంబర్ 25న) ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఇదే తరహా రాకాసి బౌన్సర్కు ప్రాణాలు వదిలాడు. ఆసీస్ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్లో భాగంగా సిడ్నీ క్రికెట్ మైదానంలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూసౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి పేసర్ విసిరిన బౌన్సర్ సౌత్ ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ అయిన ఫిలిప్ హ్యూస్కు బలంగా తగిలింది.
హెల్మెట్ ధరించినప్పటికీ రక్షణ లేని ఎడమచెవి కింది భాగంలో(మెడకు) బంతి తాకింది. దీంతో అతను వెంటనే నేలపై కుప్పకూలిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరుకొని కోమాలోకి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత సమీపంలోని ఆసుపత్రిలో కన్నుమూశాడు. మ్యాక్సీని సైతం బంతి మెడకే తగలడంతో అంతా భయపడ్డారు.
మార్కస్ స్టోయినీస్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(45 బంతుల్లో 2 ఫోర్లతో 40), చరిత్ అసలంక(25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 38 నాటౌట్), ధనంజయ డిసిల్వా(23 బంతుల్లో 3 ఫోర్లతో 26) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్, గ్లేన్ మ్యాక్స్వెల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. 16.2 ఓవర్లలో 3 వికెట్లకు 158 పరుగులు చేసి గెలుపొందింది. మార్కస్ స్టోయినీస్(18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 59 నాటౌట్) ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. గ్లేన్ మ్యాక్స్వెల్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 23) మెరుపులు మెరిపించాడు.