|
టాస్ గెలిస్తే గెలిచినట్లే..
యూఏఈలోని పిచ్లు మొదట బ్యాటింగ్కు కఠినంగా ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి పూట మ్యాచ్ల్లో అయితే మంచు ప్రభావం కారణంగా ఛేదన చేసే జట్టుకే ఎక్కువ విజయాలు దక్కాయి. టీ20 ప్రపంచకప్లో సూపర్-12 దశ నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు 23 మ్యాచ్లు జరగ్గా .. 18 సార్లు చేజింగ్ టీమ్సే గెలుపొందాయి. ఇందులో 15 సార్లు టాస్ గెలిచిన జట్లు ఉన్నాయి. ఇక రాత్రి పూట 13 మ్యాచ్లకు గాను పన్నెండు సార్లు ఛేదన చేసిన జట్లనే విజయం వరించింది. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ సులువుగా మారుతుండడంతో టాస్ గెలిచిన జట్లు మరో ఆలోచన లేకుండా బౌలింగ్కే మొగ్గు చూపాయి. టీ20 ప్రపంచకప్ చాంపియన్గా నిలిచిన ఆస్ట్రేలియా కూడా సూపర్ -12 దశలో ఇంగ్లండ్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్లో ఎలా తడబడిందో చూశాం. దాంతో టాస్ గెలిస్తే మ్యాచ్ గెలిచినట్లే అనే భావన అందరిలో ఏర్పడింది.
|
13 మ్యాచ్లకు 12..
దుబాయ్ వేదికగా జరిగిన 13 మ్యాచ్ల్లో 12 సార్లు ముందుగా ఫీల్డింగ్ చేసిన జట్టునే విజయం వరించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు పిచ్ కఠినంగా ఉండటం.. సెకండ్ బ్యాటింగ్ టైమ్లో ఫ్లాట్గా మారుతుండటంతో చేజింగ్ టీమ్స్కు అడ్వాంటేజ్గా మారింది. గ్రూప్ టాపర్స్గా నిలిచిన పాకిస్థాన్, ఇంగ్లండ్లు సైతం సెమీఫైనల్లో ఈ కారణంతోనే ఓటమిపాలయ్యాయి. ఈ రెండు కీలక మ్యాచ్లు ఒకే మాదిరిగా జరగడం విశేషం. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేశాయి. చేజింగ్లో ఆరంభంలో కీలక వికెట్లు కోల్పోయినా కలిసొచ్చిన వికెట్పై చెలరేగి ఫైనల్కు చేరాయి. తీరా ఫైనల్లో కూడా టాస్ గెలిచిన ఆస్ట్రేలియాకే టైటిల్ దక్కింది. అంతేకాకుండా హోరాహోరీ పోరుంటందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్ 172 రన్స్ చేసినా చెత్త పిచ్ కారణంగా మ్యాచ్ పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది.
|
భారత్నూ దెబ్బతీసిన టాస్..
ఎన్నో అంచనాలతో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా.. టాస్ కారణంగా ఇంటిదారిపట్టింది. పాకిస్థాన్తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ టాస్ ఓడటంతో భారత్ చిత్తయింది. ఆ తర్వాత న్యూజిలాండ్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో మళ్లీ టాస్ కలిసి రాకపోవడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 120 పరుగులు కూడా చేయలేక చిత్తుగా ఓడింది. ఆ తర్వాత చిన్నదేశాలపై గెలిచినా ఫలితం లేకుండా పోయింది. భారతే కాదు డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ సైతం టాస్కు బలైంది. భీకరమైన బ్యాటింగ్ కలిగిన ఆ జట్టు.. దుబాయ్ వికెట్ మీదు ముందుగా బ్యాటింగ్ చేసి 55 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ సైతం ఇదే సమస్యను ఎదుర్కొన్నాయి.
ఫ్యాన్స్ ఫైర్..
ఈ క్రమంలోనే ఐసీసీపై క్రికెట్ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలను ఇలా నిర్వహించడం సబబు కాదంటున్నారు. ఈ టోర్నీతో యూఏఈ పిచ్లు మెగా టోర్నీకి పనికిరావని స్పష్టమైందని, కనీసం భవిష్యత్తులోనైనా ఇక్కడ మ్యాచ్లు నిర్వహించవద్దని సూచిస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీ20 ప్రపంచకప్ తీవ్రంగా నిరాశపరిచిందని, అన్నీ మ్యాచ్లు ఏకపక్షంగా సాగాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. టాస్ గెలిచినోడిదే విజయమైనప్పుడు మ్యాచ్ ఆడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఐపీఎల్ కారణంగా యూఏఈ పిచ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఈ విషయాన్ని క్రికెట్ విశ్లేషకులు ముందే చెప్పి హెచ్చరించినా కాసులకు కక్కుర్తి పడ్డ ఐసీసీ, బీసీసీఐ వినిపించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.