టీ20 వరల్డ్ కప్ 2026లో భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ తన అద్భుతమైన ఫామ్తో ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. కీలకమైన మ్యాచ్లలో అద్భుతంగా రాణిస్తూ టీమిండియా వరుసగా రెండోసారి విశ్వ విజేతగా నిలవడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ అంతటా నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్న ఆయనకు 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ ఘనతపై స్పందించిన భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీ, సంజూను ఆకాశానికెత్తుతూ ప్రత్యేక ప్రశంసలు కురిపించాడు.
విరాట్ కోహ్లీ ప్రశంసల వెల్లువ
తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సంజూ శాంసన్ ప్రదర్శనను కొనియాడుతూ విరాట్ కోహ్లీ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పోస్ట్ చేశాడు. "ఈ టోర్నమెంట్లో 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డుకు అత్యంత అర్హత కలిగిన వ్యక్తి సంజూ శాంసన్. టోర్నీలో నీ ఆటతీరు అద్భుతం. జట్టుకు అత్యంత కీలకమైన సమయాల్లో నువ్వు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడావు. నీ ఈ విజయం పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నాను, 'చెట్టా'!" అంటూ కోహ్లీ మలయాళంలో 'అన్న/తమ్ముడు' అని పిలిచే పదాన్ని ఉపయోగిస్తూ ఆప్యాయత చాటుకున్నాడు.

ఒక ఫెయిరీ టేల్ కమ్బ్యాక్
గతంలో న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లలో వరుసగా విఫలమై.. జట్టులో తన స్థానాన్ని కూడా కోల్పోయిన స్థితి నుంచి సంజూ శాంసన్ ఈ స్థాయికి ఎదగడం ఒక ఫెయిరీ టేల్ వంటిది. ఫ్యాన్స్, విమర్శకుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ.. తనపై నమ్మకం ఉంచిన జట్టు యాజమాన్యానికి తన బ్యాటింగ్తోనే సమాధానం చెప్పాడు. విమర్శలను, ట్రోల్స్ను పక్కనపెట్టి, ఒత్తిడిలో ఎలా రాణించాలో చూపిస్తూ తన క్లాసిక్ షాట్లతో అందరినీ మైమరిపించాడు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన వర్చువల్ క్వార్టర్ ఫైనల్లో 97 పరుగులు, సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 89 పరుగులు, ఫైనల్ మ్యాచ్లో మరో 89 పరుగులతో రాణించి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.
బద్దలైన విరాట్ కోహ్లీ రికార్డులు
సంజూ శాంసన్ ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్లలో 321 పరుగులు సాధించి, టీ20 ప్రపంచకప్లో ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా విరాట్ కోహ్లీ (2014లో 319 పరుగులు) రికార్డును అధిగమించాడు. కేవలం పరుగుల రికార్డులే కాకుండా, అత్యంత ప్రతిష్టాత్మకమైన నాకౌట్ మ్యాచ్లలో (సెమీఫైనల్, ఫైనల్) వరుసగా అర్ధశతకాలు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ, షాహిద్ అఫ్రిది వంటి దిగ్గజాల సరసన సంజూ నిలిచాడు. ఇది సంజు శాంసన్ కెరీర్లోనే ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోతుంది.
ఫైనల్ మ్యాచ్లోని మెరుపులు
న్యూజిలాండ్తో జరిగిన నిర్ణయాత్మక ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ నిర్ణయం టీమిండియా బ్యాటర్ల ధాటికి బెడిసికొట్టింది. అభిషేక్ శర్మ (52), సంజూ శాంసన్ (89), ఇషాన్ కిషన్ (54) మెరుపు బ్యాటింగ్తో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో జస్ప్రీత్ బుమ్రా (4/15), అక్షర్ పటేల్ (3/23) అద్భుతమైన బౌలింగ్తో కివీస్ను కట్టడి చేయడంతో, భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది.