అక్టోబర్ 17 నుంచి
ఐపీఎల్ 2021 సీజన్ 14వ ఎపిసోడ్లో మిగిలిపోయిన మ్యాచ్లను ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. దీనికి అవసరమైన షెడ్యూల్ కూడా వెలువడింది. ఈ మెగా సీజన్ తరువాత.. ఇక అసలు సిసలు బిగ్ టోర్నమెంట్ ప్రారంభమౌతుంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మొదలవుతుంది. అక్టోబర్ 17వ తేదీన అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ను షెడ్యూల్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ నెల 4వ తేదీన క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించే టీమిండియా సుమారు నాలుగు నెలల పాటు తీరిక లేని షెడ్యూల్ను గడపబోతోంది.
టీ20 ప్రపంచకప్ డ్రీమ్టీమ్..
ఇదిలావుండగా.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో పాల్గొనబోయే భారత క్రికెట్ జట్టు డ్రీమ్ టీమ్ను ఎంపిక చేశారు టీమిండియా మాజీ ప్లేయర్ సాబా కరీం. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందిన సాబా కరీం.. తాజాగా ఎంపిక చేసిన జట్టు కూర్పు అనూహ్యంగా కనిపించింది. యంగ్ స్టర్లకు ఆయన ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ టీమ్ ఉంటేనే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్ మరింత మెరుగ్గా రాణిస్తుందని అంచనా వేశారు. కన్సిస్టెన్సీగా రాణిస్తోన్న యంగ్ క్రికెటర్ల వైపే ఆయన మొగ్గు చూపారు. జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువరక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు.
టీమ్ ఇదే..
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, టీ నటరాజన్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్లకు తన డ్రీమ్ టీమ్లో చోటు కల్పించాడు. టీ నటరాజన్, రాహుల్ చాహర్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్.. టీ20 ఇంటర్నేషనల్స్లో ఇటీవలే అడుగు పెట్టారు. పెద్ద సంఖ్యలో మ్యాచ్లను కూడా ఆడలేదు. ఈ జట్టులో శిఖర్ ధవన్, యజువేందర్ చాహల్, మహ్మద్ షమీలను తీసుకోలేదు.
యంగ్ స్టర్స్కే ప్రయారిటీ..
ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్లో అద్భుతంగా రాణిస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గాయం కారణంగా క్రికెట్కు విరామం ప్రకటించిన శ్రేేయాస్ అయ్యర్ కూడా మిడిలార్డర్లో ఉంటే భారత్కు తిరుగు ఉండదని పేర్కొన్నారు. యజువేందర్ చాహల్ కంటే రాహుల్ చాహర్ను మంచి అటాకింగ్ బౌలర్గా, మ్యాచ్ విన్నర్గా అభివర్ణించారు.
అతణ్ని జట్టులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. భువనేశ్వర్ కుమార్ లేని పేస్ బౌలింగ్ను ఊహించలేమని, ఆ విభాగానికి అతను వెన్నెముక అని అన్నారు. వాషింగ్టన్ సుందర్ నిలకడగా రాణిస్తోన్నాడని, తన దృష్టిలో ఆల్రౌండర్ అని చెప్పుకొచ్చారు. ఇక టీ నటరాజన్కు మ్యాచ్లు ఆడే కొద్దీ రాటుదేలుతాడని వ్యాఖ్యానించారు.