ఇదే చివరి మ్యాచ్ అనుకున్నా:
మ్యాచ్ అనంతరం ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ మాట్లాడుతూ... 'ఈ మ్యాచులో బ్యాటింగ్కు దిగేటపుడు ఆస్ట్రేలియా తరఫున ఇదే నా చివరి మ్యాచ్ అనుకున్నా. ఎందుకంటే.. నేను ఇంకా 23 ఏళ్ల కుర్రాడిని కాదు. అందులోనూ 2-3 ఏళ్లు జట్టుకు దూరంగా ఉన్నా. మెగా టోర్నికి 20 మ్యాచుల ముందే జట్టులోకి వచ్చా. అందుకే కాస్త ఒత్తిడికి గురయ్యా. ఈ మ్యాచ్ కోల్పోతే సర్వం పోయినట్టే అనుకున్నా. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు మేము ఫైనల్ ఆడబోతున్నాము. జట్టుకు నా అవసరం ఉన్నంతవరకు ఆడతా. అలాగే జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని అనుకుంటున్నా' అని తెలిపాడు.
నేను ఔటైనా.. మా జట్టే గెలిచేది:
'ఉత్కంఠభరితంగా మ్యాచ్ సాగుతున్న సమయంలో అసన్ అలీ క్యాచ్ను వదిలేయడం మా జట్టుకు కలిసొచ్చింది. ఒక వేళ ఆ బంతికి నేను ఔటైనా.. కచ్చితంగా మా జట్టే గెలిచేది. ఎందుకంటే అప్పటికే మార్కస్ స్టాయినిస్ క్రీజులో కుదురుకున్నాడు. నా తర్వాత బ్యాటింగ్కు వచ్చే పాట్ కమ్మిన్స్ కూడా భారీ షాట్లు అడగలడు. అయినా ఆ సమయంలో ఏం జరుగుతోందో నాకు అసలు అర్ధం కాలేదు. వచ్చిన బంతిని వచ్చినట్టుగా బాదడమే లక్ష్యంగా పెట్టుకొన్నాను. ఈ విజయానికి నేనొక్కడినే కారణం కాదు. ఆరంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. డేవిడ్ వార్నర్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు' అని మాథ్యూ వేడ్ పేర్కొన్నాడు.
స్టోయినిస్ ఒత్తిడి తగ్గించాడు:
'నేను క్రిజులోకి రాగానే మార్కస్ స్టోయినిస్తో మాట్లాడాను. పాక్ ప్రణాళికలు ఏంటి, పిచ్ ఎలా ఉందో కొంత సమాచారం ఇచ్చాడు. నేను ఊహించిన దాని కంటే కొంచెం ఎక్కువ వేగంగా బంతి వచ్చింది. దాన్ని మేము ఉపయోగించుకున్నాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పినందుకు సంతోషంగా ఉంది. మేము త్వరగా వికెట్లు కోల్పోయినందున నేను క్రీజులోకి వచ్చేముందు ఎలాంటి చర్చలు జరగలేదు. నేను మరియు మార్కస్ మొదటి గేమ్లో కలిసి బ్యాటింగ్ చేసాము. అతడు నాపై ఒత్తిడి తగ్గించాడు. అందుకే చివరలో ఆత్మవిశ్వాసంతో బౌండరీలు బాదాను' అని వేడ్ చెప్పుకొచ్చాడు.
ఫైనల్లో అమీతుమీ:
బుధవారం అబుదాబిలో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన టీ20 ప్రపంచకప్ 2021 తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్పై న్యూజీలాండ్ అద్భుత విజయం సాధించగా.. గురువారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ఇక ఆదివారం (నవంబర్ 14) జరుగనున్న మెగా ఫైనల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలువకపోవడంతో.. క్రికెట్ ప్రేమికులు కొత్త చాంపియన్ను చూడనున్నారు.