ఢాకా: పూర్తి పర్యటన కోసం రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చేసిన అభ్యర్థనను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తిరస్కరించింది. ముందుగా టీ20లు ఆడతామని, టెస్టుల గురించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీసీబీ తెలిపింది. మొదటగా టీ20 మ్యాచ్లు ఆడిన తర్వాతే టెస్టుల సంగతి చూద్దామని తేల్చి చెప్పింది. తమ దేశంలో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడాలని బంగ్లాదేశ్ను పాక్ బోర్డు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
ఫిట్నెస్ టెస్ట్ అవసరం లేదు.. నేరుగా శ్రీలంక సిరీస్లోనే బుమ్రా పునరాగమనం?!!
'పాకిస్తాన్ తమ దేశంలో అంతర్జాతీయ క్రికెట్ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నంలో ఉంది. అయితే మా జట్టు యాజమాన్యంలో చాలా మంది విదేశీయులు ఉన్నారు. జట్టు సభ్యులు, సహాయ సిబ్బంది సూచనల ప్రకారం నడుచుకుంటాం. ఇక్కడ అందరి అభిప్రాయాలను పరిశీలించాల్సిందే. మా ప్రాథమిక ప్రతిపాదన మేరకు ముందు టీ20లు ఆడతాం. ఆ తర్వాత టెస్టులపై నిర్ణయం తీసుకుంటాం' అని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదురి తెలిపాడు.
టెస్టులపై స్పష్టమైన హామీ ఇవ్వని బంగ్లాదేశ్పై పాకిస్థాన్ కెప్టెన్ అజార్ అలీ, హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అన్యాయం. టీ20లు ఆడాక టెస్టులు ఎందుకు ఆడరు. టెస్టులకు అభ్యంతరం చెప్పడానికి పాకిస్తాన్లో ప్రతికూలాంశాలు ఏమీ లేవు. పటిష్ట భద్రత ఉంది అని మిస్బా, అలీ అంటున్నారు.
2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ భయానక ఘటనతో అప్పటి నుంచి పాక్లో పర్యటించడానికి ఏ జట్టు సాహసం చేయలేదు. చాలా చర్చల తర్వాత శ్రీలంక జట్టే ఇటీవల పాకిస్థాన్లో పర్యటించి మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆడింది. కొన్ని రోజుల తర్వాత మళ్లీ రెండు టెస్టుల సిరీస్ ఆడింది. కరాచీ వేదికగా జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ తేడాతో గెలిచి సిరీస్ను 1-0 కైవసం చేసుకుంది.