హైదరాబాద్: ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టేందుకు టీ10 ఫార్మాట్ సరిగ్గా సరిపోతుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. గురువారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ ఒలింపిక్స్లో క్రికెట్ ప్రవేశపెట్టడంపై స్పందించాడు.
T10 క్రికెట్: మళ్లీ బ్యాట్ పడుతోన్న సెహ్వాగ్, ఈసారి కెప్టెన్గా బరిలోకి
ఒలింపిక్స్లో కచ్చితంగా క్రికెట్ ఉండాల్సిందేనని సెహ్వాగ్ అన్నాడు. అయితే క్రికెట్ ఉండాలంటే టీ10 ఫార్మాట్ బాగుంటుందని సెహ్వాగ్ సూచించాడు. 'ఒలింపిక్స్లో క్రికెట్ భాగం కావాలన్నది అందరి ఆశ. అయితే దీనికి టీ10 సరైన ఫార్మాట్. ఎందుకంటే ఫుట్బాల్ మ్యాచ్లాగా కేవలం 90 నిమిషాల్లోనే మ్యాచ్ అయిపోతుంది. ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఈ ఫార్మాట్ సరైందని నా భావన. క్రికెట్ను ఒలింపిక్స్లో చేర్చాలని ఐసీసీ భావిస్తే.. ఈ ఫార్మాట్ గురించి ఆలోచించాలి' అని సెహ్వాగ్ అన్నాడు.
డిసెంబర్ 14 నుంచి 16 వరకు యూఏఈలో జరిగే టీ10 క్రికెట్ లీగ్లో సెహ్వాగ్ మరాఠా అరేబియన్స్ జట్టుకు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ టీ10 ఫార్మాట్ వల్ల చాలా దేశాలు టోర్నీలో పాల్గొనే అవకాశముంటుందని అన్నాడు.
ఒకరిద్దరు ఆటగాళ్లతోనే మ్యాచ్ను గెలిచే అవకాశం ఉందని చెప్పాడు. కాబట్టి ప్రతి దేశం నుంచి ఒకరిద్దరు నాణ్యమైన ప్లేయర్లు ఉంటే సరిపోతుందని తెలిపాడు. మరోవైపు షార్జా వేదికగా డిసెంబర్లో జరగనున్న టీ10 క్రికెట్ లీగ్లో వీరేంద్ర సెహ్వాగ్, కుమార సంగక్కర వంటి మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్లు మహమ్మద్ అమీర్, కీరన్ పొలార్డ్ లాంటివారు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు.
డిసెంబర్ 14 నుంచి 16 వరకు షార్జాలో జరిగే ఈ టి10 క్రికెట్ లీగ్లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మరాఠా అరేబియన్స్, పఖ్తూన్స్, పంజాబీ లెజెండ్స్, కేరళ కింగ్స్, బెంగాల్ టైగర్స్, టీం శ్రీలంక క్రికెట్ జట్లు బరిలోకి దిగనున్నాయి. మరాఠా అరేబియన్స్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.
మరో భారత మాజీ ఆటగాడు రాబిన్ సింగ్ కేరళ కింగ్స్ జట్టుకు కోచ్గా వ్యవహరించనున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఇంగ్లండ్ లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, డారెన్ సమీ, సునీల్ నరైన్ తదితరలు ఈ టోర్నీలో ఆడనున్నారు.
ఇక టీం శ్రీలంకలో మొత్తం శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈ జట్టుకు శ్రీలంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. టోర్నీలో భాగంగా మరాఠా అరేబియన్స్ తన తొలి మ్యాచ్లో పఖ్తూన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 14న జరగనుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.