మెరిసిన కార్తీక్లు:
తొలి సెమీస్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసింది. కెప్టెన్ అశోక్ మనేరియా (51; 32 బంతుల్లో 5×4, 2×6), అర్జిత్ గుప్తా (45; 35 బంతుల్లో 2×4, 3×6) రాణించారు. తమిళనాడు బౌలర్ ఎం మహమ్మద్ (4/24) కట్టడి చేయడంతో రాజస్థాన్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టాప్-3 బ్యాట్స్మన్ విఫలమైనా.. అరుణ్ కార్తీక్ (54 బంతుల్లో 89 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) రెచ్చిపోయాడు. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (17 బంతుల్లో 29) కూడా చెలరేగడంతో మరో 8 బంతులు ఉండగానే తమిళనాడు విజయాన్ని అందుకుంది.
పంజాబ్పై బరోడా విజయం:
రెండో సెమీస్లో పంజాబ్పై బరోడా ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. కెప్టెన్ కేదర్ దేవ్ధర్ (64; 49 బంతుల్లో 4×4, 3×6), కార్తీక్ కాకడే (53; 41 బంతుల్లో 5×4, 2×6) అర్ధ శతకాలతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బరోడా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 160 పరుగులు చేసింది. హర్ప్రీత్ బ్రార్ (0/24) వికెట్లు తీయకపోయినా.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కెప్టెన్ మన్దీప్ సింగ్ (42 నాటౌట్), గుర్కీరత్ సింగ్ (39) మినహా మిగిలిన వారు విఫలమవడంతో పంజాబ్ 8 వికెట్లకు 135 పరుగులే చేయగలిగింది. బరోడా బౌలర్లు లక్మన్ మెరివాలా (3/28), నినాద్ రత్వా (2/28), బాబాషఫి (1/25) పంజాబ్ను దెబ్బతీశారు.
టైటిల్ కోసం తమిళనాడుతో బరోడా ఢీ:
ఆదివారం జరిగే తుది పోరులో టైటిల్ కోసం తమిళనాడు, బరోడా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్లోని మొతెరా స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈమ్యాచులో తమిళనాడు జట్టుది కాస్త పైచేయిగా కనిపిస్తోంది. దినేష్ కార్తీక్, విజయ్ శంకర్, బాబా అపరాజిత్, అరుణ్ కార్తీక్, మురుగన్ అశ్విన్, ఎన్ జగదీసన్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. మరోవైపు క్రునాల్ పాండ్యా, ధ్రువ్ పటేల్, విష్ణు సోలంకి, కేదర్ దేవ్ధర్ లాంటి ఆటగాళ్లు బరోడా జట్లులో ఉన్నారు. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












