
దిగ్గజాల సరసన స్మిత్
రెండు ఇన్నింగ్స్లలో 50కి పైగా స్కోర్ చేసిన బ్యాట్స్మన్ జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ముందున్నాడు. పాంటింగ్ 15 సార్లు రెండు ఇన్నింగ్స్లలో 50కి పైగా స్కోర్ చేశాడు. జాక్ కలిస్, అలిస్టర్ కుక్ చెరో 14 సార్లు.. అలెన్ బోర్డర్ (13), కుమార సంగక్కర (12) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇంజమాముల్ హాక్, శివనరేన్ చంద్రపాల్ చెరో 11 సార్లు రెండు ఇన్నింగ్స్లలో 50కి పైగా స్కోర్ చేశారు. తాజాగా ఇంజీ, చంద్రపాల్ సరసన స్టీవ్ స్మిత్ చేరాడు.

276 రన్స్ లీడ్లో ఆసీస్
ఇక స్టీవ్ స్మిత్ అర్ధ శతకంతో రాణించగా.. అతడికి కామెరాన్ గ్రీన్ సహకరిస్తున్నాడు. వీరిద్దరూ 90 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యంతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 64 ఓవర్లకు ఆ జట్టు స్కోర్ 182/4గా నమోదైంది. అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తొలి సెషన్లో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి మరో 79 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్ (58), గ్రీన్ (20) పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం పరుగులతో కలుపుకొని ప్రస్తుతం ఆసీస్ 276 రన్స్ లీడ్లో కొనసాగుతోంది.

రెండు వికెట్లు తీసిన సైనీ
అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 103/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా కీలక రెండు వికెట్లు కోల్పోయింది. మార్నస్ లబుషేన్ (73), మాథ్యూ వేడ్ (4) ఔటయ్యారు. ఇద్దరినీ నవదీప్ సైనీ ఔట్ చేశాడు. లబుషేన్, స్మిత్ మూడో వికెట్కు 103 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే వారిద్దరూ కుదురుకున్నట్లే కనిపించినా సైనీ ఓ చక్కటి బంతితో లబుషేన్ను బోల్తా కొట్టించాడు. అతడు వేసిన 47వ ఓవర్ తొలి బంతి ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లో పడడంతో ఆసీస్ 138 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం వేడ్ (4) సైతం అచ్చం అలాగే ఔటయ్యాడు. సైనీ బౌలింగ్లోనే వికెట్ల వెనుక కీపర్ సాహాకు దొరికిపోయాడు. అప్పటికి ఆ జట్టు స్కోర్ 148/4గా నమోదైంది.

350 పరుగుల టార్గెట్
మూడో రోజు ఆర్ అశ్విన్, మొహ్మద్ సిరాజ్.. ఓపెనర్లను ఔట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆసీస్ 276 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో సెషన్ ధాటిగా ఆడి.. 350 పరుగుల టార్గెట్ను టీమిండియాకు ఆసీస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. టీ బ్రేక్ అనంతరం భారత్ బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications












