రెండేసిన జడేజా :
ఓవర్నైట్ స్కోర్ 166/2తో రెండోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు స్కోరు 188/2 పరుగుల వద్ద వర్షం ప్రారంభం కావడంతో అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆపై వర్షం ఆగిపోవడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారిన మార్నస్ లబుషేన్ను (91: 196 బంతుల్లో) జడేజా పెవిలియన్కు పంపాడు. లబుషేన్ తృటిలో శతకం చేజార్చుకున్నా.. స్టీవ్ స్మిత్తో కలిసి మూడో వికెట్కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 206 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన అనంతరం మాథ్యూ వేడ్ అండతో స్మిత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపాడు. క్రీజులో కుదురుకుంటున్న వేడ్ (13; 16 బంతుల్లో 2x4)ను కూడా జడేజా బోల్తా కొట్టించాడు. జస్ప్రీత్ బుమ్రా అద్భుత క్యాచ్ అందుకోవడంతో వేడ్ ఇన్నింగ్స్ ముగిసింది. జడేజా తొలి సెషన్లో రెండు వికెట్లు తీశాడు.
స్మిత్ సెంచరీ:
అయితే రెండు కీలక వికెట్లు పడినా స్టీవ్ స్మిత్ మాత్రం భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని అర్ధ శతకం చేశాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ సిరీస్లో తొలిసారి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. భోజన విరామ సమయానికి ముందు కామెరాన్ గ్రీన్ (0)ను బుమ్రా పెవిలియన్ చేర్చాడు. అనంతరం ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోటింది. కెప్టెన్ టిమ్ పైన్ (1), పాట్ కమిన్స్ (0), నాథన్ లైయన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా స్మిత్ అద్భుత సెంచరీ చేశాడు. 201 బంతుల్లో 102 పరుగులు చేసి కెరీర్లో 27వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి రెండు టెస్ట్లలో 10 పరుగులే చేసి ఘోరంగా విఫలమైన స్మిత్.. ఈ మ్యాచ్లో తన సత్తాచాటాడు. మిచెల్ స్టార్క్ ( 24; 2 ఫోర్స్, 1 సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఈ క్రమంలోనే స్మిత్ చివర్లో ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్ 338 పరుగుల వద్ద జడేజా చేతిలో రనౌటయ్యాడు. జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
జీవనాధారం లభించినా మెరవని రోహిత్:
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. టీమిండియాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. గాయం నుంచి కోలుకొని నేరుగా ఈ మ్యాచ్లోనే ఆడుతున్న రోహిత్ శర్మ (26; 77 బంతుల్లో 3x4, 1x6) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (50; 101 బంతుల్లో 8x4)తో కలిసి తొలి వికెట్కు 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే హేజిల్వుడ్ వేసిన 27వ ఓవర్ చివరి బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందే రోహిత్కు ఓ జీవనాధారం లభించింది. లైయన్ వేసిన 24వ ఓవర్లో రోహిత్ బ్యాట్, గ్లౌజులకు ఓ బంతి తాకినట్లు అనిపించడంతో షార్ట్లెగ్లోని ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. దానికి అంపైర్ ఔటివ్వగా.. రోహిత్ రివ్యూకు వెళ్లాడు. అక్కడ నాటౌట్గా తేలడంతో ఊపిరి పీల్చుకున్నాడు. కానీ కాసేపటికే ఔటయ్యాడు.
|
గిల్ అర్ధ శతకం:
రోహిత్ శర్మ నిష్క్రమణ అనంతరం శుభ్మన్ గిల్ అర్ధ శతకం బాదిన వెంటనే పాట్ కమిన్స్ బౌలింగ్లో గ్రీన్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 85 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం టెస్ట్ స్పెషలిస్ట్ ఛెతేశ్వర్ పుజారా, కెప్టెన్ అజింక్య రహానేలు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. చివరికి భారత్ 45 ఓవర్లలో 96/2తో నిలిచి రెండో రోజును ముగించింది. మొత్తానికి రెండో రోజులో భారత్ ఆధిపత్యం చెలాయించింది.