న్యూఢిల్లీ: తన మేనత్త కుటుంబంపై దుండుగులు జరిపిన దాడి కేసును చేధించిన పోలీసులను భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అభినందించాడు. తమకు జరిగిన నష్టం పూడ్చలేనిదని, కానీ ఇలాంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ఉంటుందని పేర్కొంటూ ట్విటర్ వేదికగా పంజాబ్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు.
'దుండుగులను పట్టుకున్నామని సమాచారమిచ్చిన దర్యాప్తు అధికారులను ఈరోజు ఉదయమే పంజాబ్లో కలిసాను. నేరస్థులను పట్టుకోవడానికి వారు చేసిన ప్రయత్నాలను మనస్పూర్తిగా అభినందిస్తున్నా. మాకు జరిగిన నష్టం పూడ్చలేనిది కానీ దుండగులను అరెస్ట్ చేయడం వల్ల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేధించిన పంజాబ్ పోలీసులకు ధన్యవాదాలు.'అని రైనా ట్వీట్లో పేర్కొన్నాడు.
గత నెలలో పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలోని థర్యాల్ గ్రామంలో సురేష్ రైనా మేనత్త కుటుంబంపై దోపిడి దొంగలు దాడి చేశారు. ఈ దాడిలో రైనా మామ, కాంట్రాక్టర్ అశోక్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... హాస్పిటల్లో చికిత్స పొందుతూ.. రైనా కజిన్ కౌశల్ కుమార్ కూడా చనిపోయాడు. అయితే రైనా మేనత్త పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.
ఇక దాడిలో గాయపడిన మరో ఇద్దరు మాత్రం చికిత్స తీసుకుని కోలుకున్నారు. ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన రైనా.. ఈ దారుణ ఘటన నేపథ్యంలో ఉన్నపళంగా భారత్కు వచ్చేశాడు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైనా కూడా పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్కు విజ్ఞప్తి చేయడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు.. నెల రోజుల వ్యవధిలోనే చేధించారు.
ఈ హత్య చేసిన ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ బుధవారం మీడియాకు తెలిపారు. దీంతో దాడి కేసులో మిస్టరీ వీడింది. అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేశామని, ఈ కేసులో మరో 11 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పంజాబ్ డీజీ దినకర్ గుప్తా వెల్లడించారు. దండు పాళ్యం సినిమా తరహాలోనే దుండగులు దాడి చేశారన్నారు.