విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతివ్వాలి:
బీసీసీఐ కాంట్రాక్టుయేతర క్రికెటర్లకు విదేశీ టీ20 లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ బోర్డు అనుమతి ఇవ్వాలని సురేష్ రైనా ఇటీవలే కోరాడు. అక్కడ అనుభవంతో పాటు వైవిధ్యం దొరుకుతుందని పేర్కొన్నాడు. రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్ వంటి క్రికెటర్లు కూడా రైనాకు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం వీడ్కోలు పలికిన వారికి తప్ప విదేశీ లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వని విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఓ భారత క్రికెటర్ దేశీయ క్రికెట్, ఐపీఎల్ ఆడటానికి మాత్రమే అనుమతి ఉంది.
ఐపీఎల్లో వస్తున్నంత డబ్బు మరెక్కడా దొరకదు:
'డబ్బుల కోసం కాదు. ఐపీఎల్లో వస్తున్నంత డబ్బు మరెక్కడా దొరకదు. విదేశీ లీగుల్లో పదేళ్లు ఆడినా.. అంత సంపాదించలేం. ఐపీఎల్ సీజన్ ముగిశాక బీసీసీఐ కాంట్రాక్టు పొందని క్రికెటర్లకు మరో అవకాశం ఇవ్వాలి. ఏడాదికి ఒకటో రెండో లీగులు ఆడాలనుకుంటున్నాం. కేవలం ఆడేందుకే. ప్రస్తుతం రంజీ ట్రోఫీ నాణ్యత అంతగా లేదు. అందులో ఆడితే మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం లేదు' అని తాజాగా భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన ఇంటర్వ్యూలో సురేష్ రైనా అన్నాడు.
డబ్బు కోసం ఆడటం లేదు:
'మాకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. ఇంటివద్దే రెండు నెలలు కూర్చొని దేశవాళీ క్రికెట్ ఆడితే ఆత్మవిశ్వాసం లభించడం లేదు. మేం నాణ్యమైన క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. నేను డబ్బు కోసం ఆడటం లేదు. నాకున్న దాంతో ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను' అని రైనా తెలిపాడు. 1998లో సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసేందుకు స్కూల్ ఎగ్గొట్టిన సంగతిని వెటరన్ క్రికెటర్ గుర్తుచేసుకున్నాడు. ట్రై సిరీస్లో భాగంగా షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో సచిన్ 131 బంతుల్లో 143 పరుగులు చేసి జట్టుకు విజయం అందించాడన్నాడు.
ఆ విషయాల్ని నేను అడగలేను:
'రిటైర్మెంట్ ఎంఎస్ ధోనీ వ్యక్తిగత నిర్ణయం. ఆ విషయాల్ని నేను అడగలేను. ధోనీ ఇప్పటికీ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. కొత్త తరహా షాట్స్ కూడా ఆడుతున్నాడు. అతని బుర్రలో ఏ ఆలోచన ఉందో ఎవరికి తెలుసు. ఎప్పుడైనా మహీ సరైన నిర్ణయమే తీసుకుంటాడు' అని రైనా అన్నాడు. టీమిండియా కెప్టెన్గా ఎంఎస్ ధోనీ ఉన్న రోజుల్లో సురేశ్ రైనాకి జట్టులో స్థానానికి ఢోకా ఉండేది కాదు. కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్గా మారిన తర్వాత రైనా ఫామ్ కోల్పోయి క్రమంగా జట్టుకి దూరమయ్యాడు. ఇక ఇప్పుడు రీఎంట్రీ కోసం గత ఏడాదన్నర కాలంగా ఎదురుచూస్తున్నాడు.