సడెన్గా బ్యాటింగ్కు వెళ్లమన్నాడు
స్పోర్ట్స్ స్క్రీన్ యూట్యూబ్ చానెల్తో మాట్లాడిన రైనా పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ‘ధోనీ నిర్ణయాలను నేనెప్పుడూ ప్రశ్నించలేదు. 2015 ప్రపచంకప్లో నా బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తూ అతను తీసుకున్న నిర్ణయం నాకింకా గుర్తుంది. పాక్తో మ్యాచ్లో నేను శాండ్విచ్ తింటున్నా. ధోనీ నా దగ్గరకు వచ్చాడు. నాలుగో నెంబరులో బ్యాటింగ్కు వెళ్లాలని, వెంటనే ప్యాడ్లు కట్టుకోవాలని సూచించాడు. నేను వెంటనే బ్యాటింగ్కు సిద్ధమయ్యా. అప్పటికే శిఖర్ ధావన్, కోహ్లీ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే కొద్ది సేపటికే ధావన్ ఔటవ్వడంతో నేను బ్యాటింగ్కు వెళ్లా. చక్కగా బ్యాటింగ్ చేసి 70 నుంచి 80 పరుగులు చేసా. జట్టు గెలుపులో ఆ పరుగులు బాగా ఉపయోగపడ్డాయి' అని రైనా చెప్పుకొచ్చాడు.
కోహ్లీ విధ్వంసంతో..
ఇదిలా ఉంటే జట్టు కూర్పు ప్రకారం నాలుగో నెంబరులో రహానే బ్యాటింగ్కు వెళ్లాల్సి ఉంది. అయితే 20 ఓవర్ల తరువాత ధోనీ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో రైనా ముందుగా బ్యాంటింగ్కు వెళ్లాడు. కోహ్లీతో కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును పటిష్ట స్థాయిలో నిలిపాడు. అయితే కోహ్లీ 107 పరుగులతో సెంచరీ చేయడంతో రైనా(76) ఇన్నింగ్స్ వెలుగులోకి రాలేదు. ఇక ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 300 పరుగులు చేయగా.. పాక్ 47 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవి చూసింది.
అసలు ధోనీ వ్యూహం ఏంటని..
‘ఇక ధోనీ వ్యూహం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసుకోవడానికి ఆ సాయంత్రం అతని దగ్గరకు వెళ్లి ఎందుకు నన్ను ఆ స్థానంలో పంపిచావ్ అని అడిగా. ‘ప్రత్యర్థి జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లు ఉన్నారు. నువ్వు లెగ్స్పిన్లో బాగా ఆడుతావని తెలుసు. పైగా ఆ సమయంలో వారే బౌలింగ్ చేస్తున్నారు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ మార్చి నిన్ను బరిలోకి దించా" అని సమాధానం ఇచ్చాడు. అలానే నా బ్యాటింగ్ను కూడా కొనియాడాడు.'అని రైనా చెప్పాడు. ఇక మ్యాచ్లో ధోనీ వ్యూహానికి పాక్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా బలయ్యాడు. 60 పరుగులు సమర్పించుకొని ఒక్క వికెట్ తీయలేదు.
దేవుడు ప్రత్యేక బహుమతిగా ఇచ్చాడు..
‘ధోనీ ఆలోచన తీరు చాలా ముందుంటుంది. అనేక విషయాలో తనకున్న అవగాహన అద్భుతం. మహీ స్టంప్స్ వెనుక నిలబడి అన్నీ గ్రహిస్తాడు. దేవుడు ఖచ్చితంగా అతనికి ప్రత్యేక సామర్థ్యాన్ని బహుమతిగా ఇచ్చాడు. అందుకే అతను ఇంత విజయవంతమైన నాయకుడు అయ్యాడు' అని రైనా చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఈ సందర్బంగా రైనా ప్రశంసల జల్లు కురిపించాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ లాగే రోహిత్ శర్మ కెప్టెన్సీ ఉంటుందని కొనియాడాడు.
గంభీర్ చాలా టాలెంటెడ్.. కానీ అతని కోపమే కొంపముంచింది : మాజీ క్రికెటర్