MS Dhoniతోనే కిట్ బ్యాగు మోయించిన సురేష్ రైనా.. ఎందుకో తెలుసా?

హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరూ భారత జట్టుతో పాటు, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్కు చాలా కాలంగా ఆడిన నేపథ్యంలో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. రైనాపై ధోనీ ఎంతో నమ్మకం ఉంచేవాడు. దాన్ని మిస్టర్ ఐపీఎల్ కూడా నిలబెట్టుకునేవాడు. ఇక మహీ కెప్టెన్గా ఉన్నంతకాలం రైనాకు జట్టులో చోటు పక్కాగా ఉండేది. ఇద్దరూ కలిసి టీమిండియా, చెన్నై జట్లకు ఎన్నో విజయాలు అందించారు. అయితే ధోనీతో అనుబంధం గురించి రైనా మరోసారి పంచుకున్నాడు. గుజరాత్ లయన్స్కు సారథ్యం వహిస్తున్నప్పుడు జరిగిన ఓ సరదా సంఘటనల గురించి రైనా వివరించాడు. మహీతో తన కిట్ బ్యాగు మోయించానని రైనా గుర్తు చేసుకున్నాడు.

రండి కెప్టెన్ సాబ్:
2016లో ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐపీఎల్ ప్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్పై నిషేధం పడిన విషయం తెలిసిందే. దాంతో రైజింగ్ పుణె జట్టుకు ఎంఎస్ ధోనీ, గుజరాత్ లయన్స్కు సురేష్ రైనా సారథ్యం వహించారు. అప్పుడు పుణెతో ఆడినప్పుడు విచిత్రమైన అనుభూతి కలిగిందని రైనా పేర్కొన్నాడు. 'అప్పుడు భావోద్వేగానికి గురయ్యాను. రాజ్కోట్లో ఆడటం నాకు గుర్తుంది. ఆర్ అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడు. నాన్స్ట్రైకర్ ఎండ్లో బ్రెండన్ మెక్కలమ్ ఉన్నాడు. నేను బ్యాటింగ్ చేస్తున్నా. ధోనీ భాయ్ కీపింగ్ చేస్తున్నాడు. ఫఫ్ డుప్లెసిస్ ఫస్ట్ స్లిప్లో నిలబడ్డాడు. అందుకే మా పొరుగింటి వాళ్లతో లీగ్ ఆడినట్టు అనిపించింది. పైగా నేను క్రీజులోకి వెళ్లినపుడు 'రండి కెప్టెన్ సాబ్' అని ధోనీ అన్నాడు. 'వస్తున్నాను భాయ్.. ముందు మీరు జరగండి' అని నేను బదులిచ్చాను' అని రైనా గుర్తు చేసుకున్నాడు.

కిట్ బ్యాగ్ మొత్తం మోసుకొచ్చాడు:
2018లో ఐర్లాండ్ వెళ్లినప్పుడు మరో సరదా సంఘటన జరిగిందని సురేష్ రైనా చెప్పాడు. 'ఆ మ్యాచులో ధోనీ భాయ్ శీతల పానీయాలు అందించాడు. నేను ప్రతిసారీ గ్లోవ్స్, బ్యాట్ల కోసం పిలుస్తుండటంతో.. అతడు నా కిట్ బ్యాగ్ మొత్తం మోసుకొచ్చాడు. 'ఏం కావాలో తీసుకో. మళ్లీ మళ్లీ పిలవకు. ఇక్కడ చలిగా ఉంది' అని అన్నాడు. 'అయితే ఓ పనిచేయి. నా హ్యాండ్ గ్రిప్ తీసుకుకొని రా' అని చెప్పాను. 'భలే మంచోడివే దొరికావు. ముందు నీళ్లు తాగు. తీసుకొస్తా' అని మహీ వెళ్లాడు. ఈ రోజు మహీ భాయ్ నాకు దొరికాడు అని సంతోషించా' అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు.

యువీ ఫోన్ చేసి:
పరిమిత ఓవర్ల సిరీసులో అద్భుత ప్రదర్శన చేసిన సురేష్ రైనా.. టెస్టుల్లో మాత్రం ఆ మార్క్ చూపించలేకపోయాడు. తన టెస్టు అరంగేట్రం ఎలా జరిగిందనే విషయాన్ని రైనా చెప్పుకొచ్చాడు. 'మ్యాచ్కు ముందు రోజు రాత్రి 1 గంటల సమయంలో యువరాజ్ సింగ్ నాకు ఫోన్ చేశాడు. తనకు కడుపులో నొప్పిగా ఉందని, కొంత అసౌకర్యంగా ఉందని.. నిద్ర పట్టడం లేదని చెప్పాడు. శ్రీలంకతో మ్యాచ్కు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపాడు. మ్యాచ్ కోసం నన్ను సిద్ధంగా ఉండమని సూచించాడు. దీంతో ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. టెస్టులో తొలి మ్యాచ్ ఆడబోతునందుకు సంతోషంగా అనిపించింది' అని రైనా తెలిపాడు.

అరంగేట్ర మ్యాచ్లోనే రైనా సెంచరీ:
అరంగేట్ర మ్యాచ్లోనే సురేష్ రైనా సెంచరీతో మెరిశాడు. 12 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 120 పరుగులు చేశాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేశాడు. దీంతో శ్రీలంకతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. రైనా శతకం అనంతరం యువీ అతన్ని గట్టిగా హత్తుకుని మెచ్చుకున్నాడు. రైనా, ధోనీ ఇద్దరూ అంతర్జాతీయ క్రికెట్కు ఒకే రోజు వీడ్కోలు పలికారు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినా.. చెన్నై జట్టుకు ఇద్దరూ ఆడుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications