సీఎస్కే తరఫున 164 మ్యాచ్లు
టీమిండియా వెటరన్ బ్యాట్స్మన్ సురేష్ రైనా సీఎస్కే తరఫున 164 మ్యాచ్లాడి.. అత్యధిక మ్యాచ్లాడిన ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే మొత్తంగా 165 మ్యాచ్లు ఆడగా.. రైనా 164 మ్యాచ్లు ఆడాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ను రైనా ఆడలేదు. అదికూడా 2018లో కాలి పిక్క గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఇక సీఎస్కే తరఫున ధోనీ 160 మ్యాచ్లు ఆడాడు. అంటే ధోనీ ఐదు మ్యాచ్లు ఆడలేదు. ధోనీ మైదానంలోకి దిగినప్పుడు రైనా సీఎస్కే తరఫున సారథిగా ఉంటాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లు:
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లు ఆడిన రికార్డు కూడా సురేష్ రైనా పేరిటే ఉంది. రైనా 193 మ్యాచ్లు ఆడాడు. 164 మ్యాచ్లు సీఎస్కే తరఫున ఆడగా.. మిగిలిన మ్యాచ్లు కొచ్చి టస్కర్స్ తరఫున ఆడాడు. సీఎస్కే రెండు సంవత్సరాలు నిషేదానికి గురైన సమయంలో ఆ జట్టుకు రైనా సారథ్యం కూడా చేసాడు. సీఎస్కే, ఆర్ఆర్ స్థానాల్లో కొచ్చి టస్కర్స్, పూణే వారియర్స్ వచ్చాయి.
రెండో స్థానంలో ధోనీ:
రైనా తర్వాత ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్లు ఆడింది ఎంఎస్ ధోనీ. 190 మ్యాచ్లతో ధోనీ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ (188), దినేశ్ కార్తీక్ (182), విరాట్ కోహ్లీ (177) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. ఇప్పటివరకు 12 ఎడిషన్లను పూర్తిచేసుకుంది. ఇప్పటికే 13వ సీజన్ కూడా పూర్తయ్యేది కానీ కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది.
రైనా ఆశలకు కరోనా గండి:
మోకాలి గాయానికి గత ఏడాది ఆగస్టులో నెదర్లాండ్స్లోని అమస్టర్డామ్లో రైనా రెండోసారి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్కి దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే ఫిట్నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రైనర్ గ్రేమ్ కింగ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ సాధించాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి ప్రదర్శన చేసి ఈ ఏడాది అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్కి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని రైనా ఆశించాడు. అయితే ఐపీఎల్-13ను రద్దు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైనా ఆశలకు కరోనా గండి కొట్టేలా ఉంది.
గతేడాది జూలైలో చివరి వన్డే:
భారత్ తరఫున రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన సురేశ్ రైనా.. 78 మ్యాచ్లాడి 134.79 స్ట్రైక్రేట్తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ప్రస్తుతం రీఎంట్రీ కోసం రైనా ఎదురుచూస్తున్నాడు. టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఆ టోర్నీలో ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని 33 ఏళ్ల రైనా ఆశిస్తున్నాడు.