హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ ఆశిష్ నెహ్రా చాలా మంచివాడని సురేశ్ రైనా తెలిపాడు. న్యూజిలాండ్తో నవంబర్ 1వ తేదీన న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే టీ20 మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని ఆశిష్ నెహ్రా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆశిష్ నెహ్రాతో తనుకున్న అనుబంధాన్ని సురేశ్ రైనా గుర్తు చేసుకున్నాడు. 'నెహ్రా చాలా మంచి మనిషి. తన ఆటతీరును మెరుగు పరుచుకోవడానికి నిరంతరం శ్రమిస్తాడు. చాలాసార్లు అతడిని కలిశాను. అతడితో కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడాను' అని సురేశ్ రైనా పేర్కొన్నాడు.

'ఎల్లప్పుడు మంచి సలహాలు ఇచ్చే వారిలో అతడొకరు. 38 ఏళ్ల వయసులోనూ ఎంతో బలంగా ఉన్నాడు. అతడు ఆడే చివరి మ్యాచ్లో రాణించి, దేశానికి విజయాన్ని అందిస్తాడని ఆశిస్తుస్తున్నా' అని సురేశ్ రైనా అన్నాడు.
ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలనేది తన సొంత నిర్ణయమని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని కూడా నెహ్రా స్పష్టం చేశాడు. గువహటిలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 ముగిసిన తర్వాత ఆసీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్లు రువ్విన ఘటనపైనా సురేశ్ రైనా స్పందించాడు.
'ఇది బాధాకర ఘటన. ఏం జరిగిందనేది బీసీసీఐ విచారిస్తుంది. ఆసీస్ క్రికెటర్లతో కలిసి ఐపీఎల్లో ఆడాం. ఎవరికీ గాయాలు కాలేదు కాబట్టి ఫర్వాలేదు. బీసీసీఐ, అవినీతి వ్యతిరేక విభాగం, పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి' అని సురేశ్ రైనా అన్నాడు.