తొలితరం దళిత క్రికెటర్..
పల్వంకర్ బాలూ 1876లో బాంబే ప్రెసిడెన్సీలో భాగమైన ధార్వాడ్లో జన్మించాడు. తండ్రి బ్రిటిష్ సైన్యంలో సిపాయి కావడంతో పూణేలో పెరిగాడు. స్కూలింగ్ ముగిసాక తండ్రి సిఫారసుతో పూణేలోని జింఖానా గ్రౌండ్లో మైదానాన్ని శుభ్రపరిచే పనికి కుదిరాడు. అప్పట్లో అతడికి నెలకు రూ. 4 రూపాయల జీతం ఇచ్చేవాళ్లు. అక్కడి జింఖానా గ్రౌండ్స్లో అనేక మంది బ్రిటిషర్లు క్రికెట్ ఆడేవాళ్లు. జేజీ గ్రెయిగ్ అనే బ్రిటిషర్ నిత్యం సాధన చేసేవాడు. బౌలర్ రాని సమయంలో పల్వంకర్ బాలుతో బౌలింగ్ చేయించుకునే వాడు. బాలూలో ఉన్న స్పిన్ టెక్నిక్ చూసి ముగ్దుడైన గ్రెయిగ్ అతడిని బాగా ఎంకరేజ్ చేశాడు. దీంతో బ్రిటిష్ క్రికెటర్లలో బాలూ బౌలింగ్పై గురి ఏర్పడింది.
హిందూ జట్టు తరఫున..
వాళ్లను ముప్పతిప్పలు పెట్టడంతో బాలూ పేరు పూణే అంతటా మార్మోగిపోయింది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్లు మతాల వారీగా జరిగేవి. అంటే బ్రిటిషర్లు, ముస్లింలు, హిందువులకు ప్రత్యేకంగా క్రికెట్ టీమ్స్ ఉండేవి. అలాంటి వాటిలో పూణే హిందూ జట్టు కూడా ఒకటి. బ్రిటిషర్లతో హిందూ జట్టుకు ఒక కీలక మ్యాచ్ ఉండటంతో బాలూని తీసుకుందామని కొంత మంది ప్రతిపాదన చేశారు. అయితే బాలూ దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో మరాఠా బ్రాహ్మణులు వ్యతిరేకించారు. అయితే అదే జట్టులో ఉన్న తెలుగు బ్రాహ్మణ క్రికెటర్లు బాలూను తీసుకోవాల్సిదే అని పట్టు బట్టారు. దీంతో పూణే హిందూ జట్టులో అతడికి చోటు లభించింది. బాలూ అద్భుతమైన బౌలింగ్తో బ్రిటిషర్లపై హిందూ జట్టు గెలుపు సాధించింది.
లగాన్ సినిమాలో సీన్స్..
పల్వంకర్ బాలూ ఇక్కడి హిందూ అగ్రవర్ణ క్రికెటర్ల వల్ల అంటరానితనాన్ని అనుభవిస్తూనే వారితో కలసి క్రికెట్ ఆడాడు. 1906లో సతారాలో ఆలిండియా హిందూ జట్టుకు బ్రిటిష్ జట్టుతో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో 8 వికెట్లు తీసి పూణే హిందూ జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ ఆధారంగానే బాలీవుడ్లో లగాన్ సినిమా తీశారు. సతారాలో మ్యాచ్ గెలిచిన రోజు బాలూని ఏనుగుపై ఊరేగించడమే కాకుండా.. ఏకంగా బాలగంగాధర్ తిలక్ అతడిని సన్మానించారు. అప్పటి వరకు ఒకే జట్టులో ఆడినా బయట ఎక్కడో కూర్చొని బోజనం చేసే పల్వంకర్.. ఆ తర్వాత సహచర క్రికెటర్లతో కలిసే అన్నం తినే స్థాయికి చేరుకున్నాడు. ఇక 1911లో భారత జట్టు ఇంగ్లాండులో అనధికారికంగా పర్యటించింది. భారత జట్టు తరపున ఆడిన పల్వంకర్ ఆ పర్యటనలో 114 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.
'స్పిన్ అండ్ అదర్ టర్న్' బుక్లో..
1905 నుంచి 1920 వరకు 15 సంవత్సరాల పాటు ఇండియా తరపున క్రికెట్ ఆడిన బాలూ.. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్పిన్నర్గా నిలిచిపోయాడు. అయితే బాలూ రికార్డులను ఎవరూ అధికారికంగా నమోదు చేయలేదు. కానీ ప్రముఖ చరిత్రకారుడు, క్రికెట్ గణాంకకారుడు రామచంద్ర గుహ రాసిన 'స్పిన్ అండ్ అదర్ టర్న్' అనే పుస్తకంలో పల్వంకర్ గురించి తొలి సారిగా పలు విషయాలు వెలుగు చూశాయి. గుహ ఆ తర్వాత రాసిన 'ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారిన్ ఫీల్డ్' అనే పుస్తకంలో ఎక్కువ సమాచారం ఉంది. బాలూ గురించి ఎక్కువ సమాచారం బయటకు వచ్చింది 'విజర్డ్స్' అనే పుస్తకం ద్వారానే.. అనింద్య దత్త రాసిన ఈ పుస్తకంలో స్పిన్నర్ల గురించిన బయోగ్రఫీ ఉంటుంది. దీనిలో మొదటి చాప్టర్ పల్వంకర్ బాలూ గురించే ఉండటం గమనార్హం.