Palwankar Baloo: చరిత్ర మరిచిన దళిత క్రికెటర్.. సురేశ్ రైనా కులాహంకార వ్యాఖ్యలతో తెరపైకి!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా చేసిన కులాహంకార వ్యాఖ్యలపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్పీఎల్)లో కామెంటేటర్గా వ్యవహరిస్తున్న రైనా.. తాను బ్రాహ్మణుడినంటూ తన కులాన్ని బయటపెట్టాడు. ఉత్తరాది రాష్ట్రానికి చెందిన వాడినే అయినప్పటికీ- తమిళ బ్రాహ్మణుల అలవాట్లను సులభంగా అర్థం చేసుకోగలుగుతున్నానని పేర్కొన్నాడు. తమిళ బ్రాహ్మణ సంస్కృతి, సంప్రదాయాలను తాను అమితంగా ప్రేమిస్తానని చెప్పుకొచ్చాడు. తాము (బ్రాహ్మణులు) మంచి పరిపాలనదక్షులమని కూడా వివాదాస్పరీతీలో వ్యాఖ్యనం చేశాడు. ఈ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతూ రవీంద్రజడేజా సైతం తన కులాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశాడు.
దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అభిమానులు.. భారత తొలితరం దళిత క్రికెటర్ పల్వాంకర్ బాలు గురించి గుర్తు చేస్తున్నారు. భారత జట్టులో బ్రహ్మాణుల ఆధిపత్యం నిజమేనని, కానీ భారత క్రికెట్ జట్టు పుట్టక ముందే దేశానికి ప్రాతినిథ్యం వహించి బ్రిటీష్ వారిని తన స్పిన్తో గడగడలాడించిన ప్లేయర్ పల్వాంకర్ బాలు అని గుర్తు చేస్తున్నారు. ఆ రోజుల్లో కుల వివక్షను ఎదుర్కొంటూనే దేశానికి చిరస్మరణీయ విజయాలందించాడని పేర్కొంటున్నాడు. పల్వాంకర్ బాలు అధికారిక గణంకాలు అందుబాటులో లేకపోయినా.. కొంత మంది రచయితలు అతని ఘనతలను పుస్తకరూపంలో తీసుకొచ్చారు. పల్వాంకర్ బాలు కథ ఆధారంగానే 'లగాన్' సినిమాను రూపొందించారని కూడా చెబుతారు.

తొలితరం దళిత క్రికెటర్..
పల్వంకర్ బాలూ 1876లో బాంబే ప్రెసిడెన్సీలో భాగమైన ధార్వాడ్లో జన్మించాడు. తండ్రి బ్రిటిష్ సైన్యంలో సిపాయి కావడంతో పూణేలో పెరిగాడు. స్కూలింగ్ ముగిసాక తండ్రి సిఫారసుతో పూణేలోని జింఖానా గ్రౌండ్లో మైదానాన్ని శుభ్రపరిచే పనికి కుదిరాడు. అప్పట్లో అతడికి నెలకు రూ. 4 రూపాయల జీతం ఇచ్చేవాళ్లు. అక్కడి జింఖానా గ్రౌండ్స్లో అనేక మంది బ్రిటిషర్లు క్రికెట్ ఆడేవాళ్లు. జేజీ గ్రెయిగ్ అనే బ్రిటిషర్ నిత్యం సాధన చేసేవాడు. బౌలర్ రాని సమయంలో పల్వంకర్ బాలుతో బౌలింగ్ చేయించుకునే వాడు. బాలూలో ఉన్న స్పిన్ టెక్నిక్ చూసి ముగ్దుడైన గ్రెయిగ్ అతడిని బాగా ఎంకరేజ్ చేశాడు. దీంతో బ్రిటిష్ క్రికెటర్లలో బాలూ బౌలింగ్పై గురి ఏర్పడింది.

హిందూ జట్టు తరఫున..
వాళ్లను ముప్పతిప్పలు పెట్టడంతో బాలూ పేరు పూణే అంతటా మార్మోగిపోయింది. అప్పట్లో క్రికెట్ మ్యాచ్లు మతాల వారీగా జరిగేవి. అంటే బ్రిటిషర్లు, ముస్లింలు, హిందువులకు ప్రత్యేకంగా క్రికెట్ టీమ్స్ ఉండేవి. అలాంటి వాటిలో పూణే హిందూ జట్టు కూడా ఒకటి. బ్రిటిషర్లతో హిందూ జట్టుకు ఒక కీలక మ్యాచ్ ఉండటంతో బాలూని తీసుకుందామని కొంత మంది ప్రతిపాదన చేశారు. అయితే బాలూ దళిత కుటుంబానికి చెందిన వాడు కావడంతో మరాఠా బ్రాహ్మణులు వ్యతిరేకించారు. అయితే అదే జట్టులో ఉన్న తెలుగు బ్రాహ్మణ క్రికెటర్లు బాలూను తీసుకోవాల్సిదే అని పట్టు బట్టారు. దీంతో పూణే హిందూ జట్టులో అతడికి చోటు లభించింది. బాలూ అద్భుతమైన బౌలింగ్తో బ్రిటిషర్లపై హిందూ జట్టు గెలుపు సాధించింది.

లగాన్ సినిమాలో సీన్స్..
పల్వంకర్ బాలూ ఇక్కడి హిందూ అగ్రవర్ణ క్రికెటర్ల వల్ల అంటరానితనాన్ని అనుభవిస్తూనే వారితో కలసి క్రికెట్ ఆడాడు. 1906లో సతారాలో ఆలిండియా హిందూ జట్టుకు బ్రిటిష్ జట్టుతో క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో 8 వికెట్లు తీసి పూణే హిందూ జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్ ఆధారంగానే బాలీవుడ్లో లగాన్ సినిమా తీశారు. సతారాలో మ్యాచ్ గెలిచిన రోజు బాలూని ఏనుగుపై ఊరేగించడమే కాకుండా.. ఏకంగా బాలగంగాధర్ తిలక్ అతడిని సన్మానించారు. అప్పటి వరకు ఒకే జట్టులో ఆడినా బయట ఎక్కడో కూర్చొని బోజనం చేసే పల్వంకర్.. ఆ తర్వాత సహచర క్రికెటర్లతో కలిసే అన్నం తినే స్థాయికి చేరుకున్నాడు. ఇక 1911లో భారత జట్టు ఇంగ్లాండులో అనధికారికంగా పర్యటించింది. భారత జట్టు తరపున ఆడిన పల్వంకర్ ఆ పర్యటనలో 114 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు.

'స్పిన్ అండ్ అదర్ టర్న్' బుక్లో..
1905 నుంచి 1920 వరకు 15 సంవత్సరాల పాటు ఇండియా తరపున క్రికెట్ ఆడిన బాలూ.. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ స్పిన్నర్గా నిలిచిపోయాడు. అయితే బాలూ రికార్డులను ఎవరూ అధికారికంగా నమోదు చేయలేదు. కానీ ప్రముఖ చరిత్రకారుడు, క్రికెట్ గణాంకకారుడు రామచంద్ర గుహ రాసిన 'స్పిన్ అండ్ అదర్ టర్న్' అనే పుస్తకంలో పల్వంకర్ గురించి తొలి సారిగా పలు విషయాలు వెలుగు చూశాయి. గుహ ఆ తర్వాత రాసిన 'ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారిన్ ఫీల్డ్' అనే పుస్తకంలో ఎక్కువ సమాచారం ఉంది. బాలూ గురించి ఎక్కువ సమాచారం బయటకు వచ్చింది 'విజర్డ్స్' అనే పుస్తకం ద్వారానే.. అనింద్య దత్త రాసిన ఈ పుస్తకంలో స్పిన్నర్ల గురించిన బయోగ్రఫీ ఉంటుంది. దీనిలో మొదటి చాప్టర్ పల్వంకర్ బాలూ గురించే ఉండటం గమనార్హం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications