హైదరాబాద్: బీసీసీఐ రాజ్యాంగ ముసాయిదాపై తుది తీర్పు వెలువడే దాకా రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఎన్నికలు నిర్వహించవద్దంటూ గురువారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ ఖాన్విల్కర్, డీవై చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పాటు సీనియర్ అడ్వకేట్, అమికస్ క్యూరీ గోపాల్ సబ్రమణ్యమ్ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంటూ తీర్పును వాయిదా వేసింది. ఒకే పదవికి రెండోసారి పోటీ చేయనప్పుడు విరామం అవసరం ఏముందని జస్టిస్ దీపక్ మిశ్రా ప్రశ్నించారు. జస్టిస్ చంద్రచూడ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం జేశారు.
ఒక రాష్ట్రం.. ఒక ఓటుపై గతంలో ఇచ్చిన తీర్పును కూడా సమీక్షించనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. "ఒక ఓటు ఒక రాష్ట్రం, 70 ఏళ్ల వయస్సు నిబంధన, జాతీయ సెలెక్టర్ల ఎంపిక వంటి వాటిపై అమికస్ క్యూరీతో పాటు రాష్ట్ర క్రికెట్ సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటాం" అని ధర్మాసనం పేర్కొంది.
"ఆచరణ సాధ్యమైన వాటిని పరిగణనలోకి తీసుకుని, మిగతా విషయాల జోలికి వెళ్లం. ఈ విషయంలో తుది తీర్పు వచ్చే వరకు రాష్ట్ర క్రికెట్ సంఘాల ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలి. అడ్మినిస్ట్రేటర్ల నియామకం విషయంలో క్రికెట్ సంఘాల కొత్త వాదనలపై రాష్ట్రాల హైకోర్టులు కఠినంగా ఉండాలి" అని సుప్రీం తన తీర్పులో పేర్కొంది.
ప్రతి రాష్ట్రానికి పూర్తి స్థాయి సభ్యత్వంతో పాటు ఓటింగ్ హక్కు ఉండాలంటూ అమికస్ క్యూరీ సుబ్రమణ్యం ప్రతిపాదనకు సుప్రీం ధర్మాసనం అంగీకరించింది. కాగా, సభ్యుల విరామం నిబంధనపై సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి సంతృప్తి వ్యక్తంజేశాడు. తమ వాదన సరైనదని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో స్పష్ట మైందని అన్నాడు.