మూడు నెలల్లో సమాధానం చెప్పండి
స్పాట్ ఫిక్సింగ్ కేసును మరోసారి విచారించి మూడు నెలల్లో సమాధానం చెప్పాలని బీసీసీఐని ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. శ్రీశాంత్ తరఫున ప్రముఖ న్యాయవాది సల్మాన్ ఖుర్షిద్ శుక్రవారం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. "కచ్చితమైన ఆధారాలు లేకుండా బీసీసీఐ.. శ్రీశాంత్పై నిషేధం విధించడం దారుణం" అని అన్నారు.
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం
"2013 ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన శ్రీశాంత్ స్పాట్ఫిక్సింగ్కు పాల్పడ్డాడని.. ఒక ఓవర్లో 14 పరుగులు ఇచ్చేందుకు ఫిక్సర్లతో ఒప్పందం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఓవర్లో శ్రీశాంత్ 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అసలు శ్రీశాంత్ మ్యాచ్ఫిక్సింగ్కు పాల్పడలేదు" అని ఖుర్షిద్ అన్నారు.
సరైన ఆధారాలు కూడా లేవు
"అంతేకాదు ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు కూడా లేవు. కేవలం ప్రాథమిక సమాచారం ఆధారంగా శ్రీశాంత్పై జీవితకాల నిషేధం విధించడం సరికాదు" అని ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీసీసీఐ శ్రీశాంత్ను జీవితకాలం నిషేధించడం ఎంతమాత్రం సరికాదని అన్నారు.
కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చింది
2018 ఆగస్టులో కేరళ హైకోర్టు కూడా బీసీసీఐ నిర్ణయాన్ని తోసిపుచ్చిందని అయినా బీసీసీఐ తన నిర్ణయం మార్చుకోలేదని ఈ సందర్భంగా సుప్రీం కోర్టుకు ఆయన విన్నవించారు. దీంతో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా ధర్మాసనానికి ఖుర్షీద్ తెలిపారు. అంతేకాదు, బీసీసీఐ తనపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తే శ్రీశాంత్ తిరిగి క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా కూడా ఉన్నాడని ఆయన సుప్రీం కోర్టుకు తెలిపారు.
టోర్నీకి రెండేళ్లు దూరమైన రాజస్థాన్, చెన్నై
మే 2013లో శ్రీశాంత్తో పాటు అంకిత్ చవాన్, అజిత్ ఛండిల్లాలపై స్ఫాట్ ఫిక్సింగ్ ఆరోణపలు రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ ముగ్గురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ముగ్గురినీ బీసీసీఐ జీవితకాలం నిషేధించింది. భారత్ తరఫున శ్రీశాంత్ 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచులు ఆడాడు.