ఆదుకున్న వ్యాట్:
144 పరుగుల ఛేదనలో వెలాసిటీకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (2), హేలీ మాథ్యూస్ (11) త్వరగానే ఔటయ్యారు. ఈ దశలో డేనియెల్ వ్యాట్ (43; 33 బంతుల్లో 4×4, 2×6).. కెప్టెన్ మిథాలీ రాజ్ (40*; 42 బంతుల్లో 3×4)తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపింది. ఈ క్రమంలోనే ఇద్దరు జట్టును విజయం వైపు తీసుకెళ్లారు.
చివరి ఓవర్.. 23 పరుగులు:
అయితే కీలక సమయంలో వ్యాట్ను పూనమ్ యాదవ్ పెవిలియన్ చేర్చింది. అనంతరం మిథాలీ, వేద కృష్ణమూర్తి (30; 29 బంతుల్లో 3×4) వేగంగా ఆడలేకపోయారు. వెలాసిటీ చివరి ఓవర్లో 23 పరుగులు చేయాల్సి ఉండగా.. 10 పరుగులే చేసి ఓడిపోయింది. ట్రయల్బ్లేజర్స్తో జరిగిన మ్యాచులో 2 పరుగులు చేయాల్సి ఉండగా.. 7 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన విషయం తెలిసిందే.
రోడ్రిగ్స్ మెరుపులు:
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్కు మంచి ఆరంభమే దక్కింది. ప్రియా పూనియా, జయంగని బౌండరీల మోత మోగించారు. పూనియా (16; 2 ఫోర్లు)ను శిఖాపాండే పెవిలియన్ చేర్చింది. అనంతరం క్రిజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (77*; 48 బంతుల్లో 10×4, 1×6) .. జయంగనితో కలిసి రెండో వికెట్కు 55 పరుగులు జోడించింది. జయంగని (38 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఔటయ్యాక.. సోఫీ డివైన్తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు డివైన్(9), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (1 )ధాటిగా ఆడలేకపోయారు. దీంతో సూపర్నోవాస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.