హైదరాబాద్: మరి కొద్ది నెలల్లో ఐపీఎల్ 2019 మొదలుకాబోతుండగా ఫ్రాంచైజీల మధ్య బదిలీలు మొదలైయ్యాయి. ఈ క్రమంలో టాప్ ఆర్డర్ గురించి బాధపడుతోన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ ధావన్ను తమ జట్టులో చేర్చుకునేందుకు వేలం ద్వారా కృషి చేసి సఫలీకృతమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ డేర్డెవిల్స్కు ఆడటం ఖాయంగానే కనిపిస్తున్నట్లుంది.
దీంతో పదకొండేళ్ల తర్వాత అతడు ఢిల్లీకి ఆడుతుండటం విశేషం. గతేడాది వేలంలో ఆర్టీఎం విధానంలో ధావన్ను రూ.5.2 కోట్లకు సన్రైజర్స్ తీసుకుంది. ఎక్కువ ధరకు తనను రిటైన్ చేసుకోలేదని గబ్బర్ సన్రైజర్స్ కోచ్తో వాగ్వాదానికి దిగినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అతడిని ట్రేడాఫ్ విధానంలో తీసుకొనేందుకు ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆసక్తి చూపించాయి. వేలం ద్వారా కొనుగోలు చేసేందుకు పంజాబ్ అమితాసక్తి చూపించి బీసీసీఐకి కూడా సమాచారం చేరవేసింది. కానీ, ఎట్టకేలకు అతడిని ఢిల్లీ డేర్ డెవిల్స్ దక్కించుకుందన్నట్లు తెలుస్తోంది.
శిఖర్ ధావన్కు బదులుగా ఢిల్లీ నుంచి షాబాజ్ నదీమ్, విజయ్ శంకర్, అభిషేక్ వర్మను సన్రైజర్స్ హైదరాబాద్ తీసుకోనుంది. ఈ విషయంలో సన్రైజర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందని సమాచారం. దేశవాళీ క్రికెట్లో మంచి పేరున్న నదీమ్ (రూ.3.2 కోట్లు)ను భారత స్పిన్నర్ కోటాలో వినియోగించుకోనుంది.
ఇక ఏడాది అంతరం తర్వాత విజయ్ శంకర్ (రూ.3.2 కోట్లు) తిరిగి హైదరాబాద్కు వస్తున్నాడు. అతడు తన ఆల్రౌండ్ సేవలతో జట్టును మరింత పటిష్ఠం చేయనున్నాడు. ఇక యువ అభిషేక్ వర్మ (రూ.55 లక్షలు) మిడిలార్డర్లో ఉపయోగపడతాడు. ఈ ముగ్గురికి ఇవ్వాల్సిన మొత్తం రూ.6.95 కోట్లు. ధావన్ విలువ రూ.5.2 కోట్లు. మిగిలిన డబ్బును దిల్లీకి హైదరాబాద్ చెల్లించాల్సి ఉంటుంది.