మామూలుగానే ఐపీఎల్ వేలంలో ఆల్రౌండర్లకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అదే సదరు ఆల్రౌండర్ భారత్లో రాణించి ఉంటే.. అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడతాయి. వచ్చే నెలలో జరిగే మినీ వేలంలో సరిగ్గా అలాంటి దృశ్యమే కనిపించే అవకాశం కనపడుతోంది. ఎందుకంటే భారత్లో ఆస్ట్రేలియా జట్టు పర్యటన సందర్భంగా.. ఆ జట్టు యువ ఆల్రౌండర్ జేమ్స్ కామెరూన్ ఏ రేంజ్లో రెచ్చిపోయాడో తెలిసిందే. అతను ఈ మినీ వేలం బరిలో దిగుతున్నట్లు ప్రకటించాడు.
కామెరూన్ ఇలా ప్రకటించాడో లేదో చాలా జట్లు అతన్ని ఎలా కొనుగోలు చేయాలా? అని ఆలోచనల్లో పడిపోయాయి. వీటిలో సన్రైజర్స్ హైదరాబాద్ కూడా ఒకటి. ప్రస్తుతం మినీ వేలంలో పర్సులో భారీగా నగదు ఉన్న జట్లలో సన్రైజర్స్ ఒకటి. ఈ జట్టు వద్ద రూ.42 కోట్లకుపైగా పర్సులో సొమ్ము ఉంది. ఈ డబ్బుతో ఎలాగైనా కామెరూన్ను కొనేయాలని సన్రైజర్స్ యాజమాన్యం ఆలోచిస్తోందట.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వద్ద నిఖార్సయిన ఓపెనర్ లేడు. వార్నర్ను తీసేసిన తర్వాత ఓపెనర్గా కేన్ విలియమ్సన్ వచ్చేవాడు. కానీ అతను కూడా పెద్దగా రాణించలేదు. దీంతో అతన్ని ఈ మినీ వేలం ముందే కావ్య అండ్ కో రిలీజ్ చేసేశారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మకు జోడీగా మంచి ఓపెనింగ్ ఇచ్చే బ్యాటర్ లేకుండా పోయాడు. రాహుల్ త్రిపాఠీకి అవకాశం ఉన్నా కూడా.. అతను మూడో స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు. కాబట్టి అతన్ని ముందుగా పంపించి ప్రయోగం చేయడం సన్రైజర్స్కు పెద్ద గ్యాంబిల్ వంటిదే.
అందుకే కామెరూన్ గ్రీన్ను కొనుగోలు చేసి, అభిషేక్కు జోడీగా పంపాలని కావ్య పాప ఆలోచిస్తోందట. ఇద్దరూ ధనా ధన్ షాట్లు ఆడి జట్టుకు మంచి ఓపెనింగ్ అందిస్తే.. సన్రైజర్స్ విజయాలకు బాటలు వేసినట్లేనని ఆమె ఆలోచన. అన్నీ అనుకున్నట్లు జరిగితే కామెరూన్ గ్రీన్ వచ్చి ఆరెంజ్ ఆర్మీలో చేరే అవకాశం ఉంది. అలాగే బెన్స్టోక్స్ను కూడా కొనేసి జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని కావ్య ప్లాన్ చేస్తోందట. అదే జరిగితే సన్రైజర్స్ కచ్చితంగా గతేడాది కన్నా మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
బెన్ స్టోక్స్ కూడా మంచి ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. అతను ఉంటే బ్యాటింగ్లో డెప్త్ కూడా పెరుగుతుంది. నిలకడగా ఆడుతూ జట్టుకు అవసరమైన తరహాలో ఇన్నింగ్స్ ఆడే సామర్ధ్యం స్టోక్స్కు ఉంది. ఈ లెక్కన ఆరంభంలో కామెరూన్ గ్రీన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, చివర్లో స్టోక్స్ తదితరులతో సన్రైజర్స్ మంచి బలమైన జట్టుగా మారిపోతుంది.