చెన్నైపై ఆడడానికి ఆసక్తితో ఉన్నా:
తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో పోస్టు చేసిన ఓ వీడియలో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మన్ విజయ్ శంకర్ మాట్లాడుతూ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సీజన్లో ఏ జట్టుపై ఆడడానికి ఎక్కువ ఆసక్తిగా ఉన్నావని విజయ్ను అడగ్గా.. 'నేను చెన్నై సూపర్ కింగ్స్ నుంచే వచ్చినందున ఆ జట్టుపైనే ఆడేందుకు ఎక్కువ ఆసక్తితో ఉన్నా. చెన్నైపై మంచి ప్రదర్శన చేస్తే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఆ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారిపై బాగా ఆడాలి' అని సమాధానం ఇచ్చాడు. 2014లో చెన్నై తరఫున తొలి మ్యాచ్ ఆడిన శంకర్.. 2017 వరకు మళ్లీ ఈ టోర్నీలో కనిపించలేదు. తర్వాత సన్రైజర్స్ తరఫున ఆడుతున్నాడు.
సన్రైజర్స్ జట్టును గెలిపించడమే లక్ష్యం:
ఐపీఎల్ 2020లో వ్యక్తిగత లక్ష్యం ఏమైనా ఉందా అని విజయ్ శంకర్ను ప్రశ్నించగా.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును గెలిపించడమే తన ముఖ్యమైన లక్ష్యం అని తెలిపాడు. ఏ స్థానంలో బ్యాటింగ్ చేసినా, ఎప్పుడు బౌలింగ్ చేసినా సన్రైజర్స్ జట్టు విజయానికే కృషి చేయాలని ఉందన్నాడు. సన్రైజర్స్ మాత్రమే కాదు నేను ఏ జట్టుకు ఆడినా గెలుపే లక్ష్యంగా ఆడుతానన్నాడు. అంతర్జాతీయ కెరీర్లో శంకర్ ఇప్పటివరకు 12 వన్డేల్లో, 9 టీ20 మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇదివరకే ఒక రికార్డు సృష్టించా:
ఐపీఎల్ 2020లో ఏ రికార్డును బద్దలు కొట్టాలని అనుకుంటున్నావని అడగ్గా.. దానికి విజయ్ శంకర్ సరదాగా సమాధానమిచ్చాడు. 'నాకు తెలిసి ఐపీఎల్లో ఇదివరకే ఒక రికార్డు సృష్టించా. డకౌట్ కాకుండా అత్యధిక ఇన్నింగ్స్లు (29) ఆడిన భారత బ్యాట్స్మన్గా ఉన్నా (నవ్వుతూ)' అని శంకర్ అన్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (974) ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ డకౌట్ అవ్వకుండా అత్యధిక పరుగులు చేశాడు. ఆ తర్వాత శంకరే రెండో స్థానంలో ఉన్నాడు. మెగా టోర్నీలో మొత్తం 33 మ్యాచ్లు ఆడిన శంకర్ 557 పరుగులు చేశాడు.
మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాలని:
2019 వన్డే ప్రపంచకప్ జట్టులో అనూహ్యంగా అవకాశాన్ని దక్కించుకున్న విజయ్ శంకర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. గాయంతో మెగా టోర్నీ మధ్యలోనే వెనుదిరిగాడు. అప్పటినుంచి భారత జట్టుకు ఎంపిక కాలేదు. గతేడాది చివరి నుంచి దేశవాళీ క్రికెట్లో తమిళనాడు తరఫున రెగ్యులర్గా మ్యాచ్లాడిన శంకర్.. తన ఆటని మెరుగుపర్చుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 సీజన్లో ఫామ్ నిరూపించుకుని మళ్లీ సెలక్టర్ల దృష్టిలో పడాలని చూస్తున్నాడు.