లండన్: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ స్థానంలో ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ సరైనోడు అని ఇంగ్లీష్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంటున్నాడు. జులై 8వ తేదీ నుంచి వెస్టిండీస్తో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. రూట్ తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రూట్ భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చే సమయం కావడంతో మొదటి టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ అయిన రూట్.. దూరమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రూట్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యాలు స్టోక్స్కు ఉన్నాయని బ్రాడ్ అన్నాడు.
తాజాగా స్టువర్ట్ బ్రాడ్ వర్చువల్ న్యూస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ... 'బెన్ స్టోక్స్తో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అతను పెద్ద ఒత్తిడి కూడా తీసుకోడు. ఒక కెప్టెన్గా ఇది చాలా అవసరం. విండీస్తో తొలి టెస్టుకు జో రూట్ అందుబాటులో లేకపోతే స్టోక్స్నే కెప్టెన్గా నియమిస్తే బాగుంటుంది. అన్ని విధాలా అర్హతలు ఉన్న వ్యక్తి చేతికే కెప్టెన్సీ ఇస్తే జట్టును సక్రమంగా నడిపిస్తాడు. కెప్టెన్సీ జాబ్ అనేది చాలా కఠినమైనది. అదనపు సమావేశాలు, ప్లానింగ్లు చాలా ఉంటాయి. స్టోక్స్ది ఒక మంచి క్రికెట్ బ్రెయిన్. గత కొన్నేళ్లుగా ఒక పరిపక్వత చెందిన క్రికెటర్లా మారాడు. కెప్టెన్సీ అతనికి సులువే. ప్రస్తుతం ఒక గేమ్కే కాబట్టి స్టోక్స్కు ఇబ్బందే ఉండదు' అని అన్నాడు.
గతంలో బ్రాడ్తో స్టోక్స్ ఘర్షణ పడిన విషయం తెలిసిందే. గతేడాది చివరలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ క్రికెటర్లు స్టువర్ట్ బ్రాడ్-బెన్ స్టోక్స్ల మధ్య వాడివేడి వాగ్వాదం చోటుచేసుకుంది. ఆటగాళ్లలో ప్రేరణ నింపే క్రమంలో బ్రాడ్తో స్టోక్స్ వాగ్వాదానికి దిగాడు. ఆటగాళ్లలో ప్రేరణ కల్గించడం గొప్ప విషయం కాదంటూ బ్రాడ్ను చిన్నబుచ్చేలా మాట్లాడటంతో అది తారాస్థాయికి చేరింది. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్నా తర్వాత దాన్ని సీరియస్గా తీసుకోలేదు.
జో రూట్ అందుబాటులో లేకుంటే వికెట్కీపర్ జోస్ బట్లర్కు జట్టు పగ్గాలందించాలని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఇప్పటికే సూచించాడు. 'ఇప్పుడున్న స్టోక్స్ ఆటతీరులో ఎటువంటి మార్పులు రావడం నాకిష్టం లేదు. అందుకే నేనైతే కెప్టెన్సీ బాధ్యతలను బట్లర్కు అప్పగిస్తా. అతడు కెప్టెన్సీ బాగా చేయగలడు' అని పీటర్సన్ చెప్పాడు. ఒక్కొక్కరు ఒక్కోవిధగా తమ అభిప్రాయాలు తెలుపుతుండడంతో.. రూట్ లేనప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికివ్వాలనే అంశంపై ఇంగ్లండ్ క్రికెట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
మూడు టెస్టుల సిరీస్ పూర్తిగా బయో సెక్యూర్ వాతావరణంలో జరగనుంది. ఇందుకోసం ఈసీబీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జులై 8 నుంచి 12 వరకూ హోంప్షైర్లో తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. జులై 16 నుంచి 20 మధ్య రెండో టెస్టు, 24 నుంచి 28 వరకూ మూడో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ వేదికగా జరగనున్నాయి.
ఐసీసీ అంపైర్ ఎలైట్ ప్యానెల్లో నితిన్ మీనన్.. మూడో భారతీయుడుగా రికార్డు!!