హైదరాబాద్: బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్స్మిత్ చెప్పుకొచ్చాడు. సఫారీ పర్యటనలో భాగంగా కేప్టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెటర్లు బాల్ ట్యాంపరింగ్కి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై ప్రస్తుతం స్టీవ్ స్మిత్.. చేసిన తప్పు నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాడని అతను వచ్చే ఏడాది బలంగా పునరాగమనం చేస్తాడని గ్రేమ్స్మిత్ అభిప్రాయపడ్డాడు. 'స్టీవ్స్మిత్ ఇంకా యువకుడు. మనందరం తప్పులు చేస్తుంటాం. నా అంచనా ప్రకారం స్టీవ్స్మిత్ బలంగా పునరాగమనం చేస్తాడు. బాల్ టాంపరింగ్ తర్వాత అతనిలో మానసిక దృఢత్వం కూడా పెరుగుంటుంది' అని అన్నాడు.
'ప్రస్తుతం అతను తాను చేసిన తప్పును సమీక్షించుకుంటున్నాడు. మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. ఎలాగైనా గెలవాలన్నది ఆస్ట్రేలియా జట్టులో జీర్ణించుకుపోయింది. అదే బాల్ టాంపరింగ్ తప్పునకి ఉసిగొల్పుటుంది. కేప్టౌన్లో స్టీవ్ స్మిత్ ఈ ప్రణాళికను అమలు చేయడం పిచ్చితనం' అని గ్రేమ్స్మిత్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, మాజీ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్లు బాల్ టాంపరింగ్ నేరానికి ప్రణాళిక రచించగా కామెరూన్ బాన్క్రాఫ్ట్ దానిని మైదానంలో అమలు చేశాడు. ఈ దృశ్యం కెమెరాలకు కంటికి చిక్కడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో స్మిత్, వార్నర్లపై ఏడాది పాటు, బాన్క్రాఫ్ట్పై 9 నెలల పాటు నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన సంగతి తెలిసిందే.