
బ్రిస్బేన్: గత మూడు నాలుగు రోజులుగా క్రికెట్ ప్రపంచంలో ఎక్కడ చూసినా, విన్నా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ గురించే చర్చలు సాగుతున్నాయి. సిడ్నీ టెస్ట్ చివరి రోజు ఆటలోని డ్రింక్స్ బ్రేక్లో రిషభ్ పంత్ గార్డ్ మార్క్ను కావాలనే చెరిపివేశాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. బాల్టాంపరింగ్తో ఏడాది పాటు నిషేదానికి గురైనా.. ఇంకా మారలేదని సోషల్ మీడియా కోడై కూసింది. వీరేందర్ సెహ్వాగ్, మైకేల్ వాన్ లాంటి మాజీలు కూడా స్మిత్ తప్పు చేశాడని మండిపడ్డారు. కానీ తానెలాంటి తప్పు చేయలేదని స్మిత్ ఎంత చెప్పినా, ఆస్ట్రేలియా జట్టు అతడిని వెనకేసుకొచ్చినా..దుర్బుద్ధితోనే స్మిత్ చేశాడనే అనుమానం ఎంతో మందిలో అలానే ఉంది.
అయితే ఈ వివాదానికి సంబంధించిన మరో వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాన్ని చూసిన తర్వాత స్టీవ్ స్మిత్ది దురుద్దేశం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు వైరల్ అయిన వీడియోలో.. స్మిత్ క్రీజు వద్దకు వచ్చి రిషబ్ పంత్ గార్డ్ మార్క్ను చెరిపివేస్తున్నది మాత్రమే కనిపించింది. కానీ తాజా వీడియోలో అసలు దాని కంటే ముందు ఏం జరిగిందనే విషయం వెల్లడైంది.
చివరి రోజు డ్రింక్స్ బ్రేక్లో మైదాన సిబ్బంది పిచ్ను శుభ్రం చేయడానికి వచ్చారు. బ్రష్తో క్రీజును శుభ్రం చేశారు. ఆ తర్వాత పెయింట్తో క్రీజు మార్క్ గీశారు. అయితే సిబ్బంది బ్రష్తో శుభ్రం చేసినప్పుడే.. అక్కడ ఉన్న గ్రేడ్ మార్క్లు తొలగిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీంతో స్టీవ్ స్మిత్ తప్పు చేయలేదని భావిస్తున్నారు. ఈ వీడియోతోనైనా స్మిత్పై ఉన్న వివాదానికి ముగింపు పడుతుంతో లేదో చూడాలి.
స్టీవ్ స్మిత్కు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ మద్దతుగా నిలిచాడు. ఆ సంఘటనలో స్మిత్ 100 శాతం అమాయకుడని అన్నాడు. 'స్మిత్పై వచ్చిన కొన్ని చెత్త వార్తలను నమ్మలేకపోయా. అతడి గురించి తెలిసివారు ఎవరైనా స్మిత్ చమత్కారమైన పనులు చేస్తాడని చెబుతారు. గత కొన్నేళ్లుగా అతడు చేసే పనులు చూసి మేం సరదాగా నవ్వుకున్నాం. అయితే స్మిత్ ఎన్నోసార్లు క్రీజు వద్దకు వెళ్లి అలా చేశాడు. మ్యాచ్ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికే మాత్రమే అలా చేస్తాడు. సిడ్నీ వికెట్ ఫ్లాట్గా, కాంక్రీట్లా ఉంది. క్రీజు వద్దకు వెళ్లి ఏదైనా చేయాలనుకుంటే 15 అంగుళాల స్పైక్స్ అవసరం. అయితే స్మిత్ క్రీజువద్దకు వెళ్లలేదు. అతడిపై నిందలు రావడం హాస్యాస్పదంగా ఉంది' అని అన్నాడు.